తొలి పసుపు పరిశ్రమ!
డొంకేశ్వర్(ఆర్మూర్) : రాష్ట్రంలోనే తొలిసారిగా రైతులే స్వయంగా జక్రాన్పల్లి మండలం మనోహరాబాద్లో నెలకొల్పిన పసుపు పరిశ్రమ ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అర్వింద్ సోమవారం ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించనున్నారు. ఇందుకు ‘రైతు ఉత్పత్తిదారుల సంఘం’ అన్ని ఏర్పాట్లు చేసింది. ఎంపీతో పాటు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి, జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, పసుపు బోర్డు కార్యదర్శి భవానీ శ్రీ, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్య నారాయణ, జిల్లా కలెక్టర్ రాజీవ్గాంధీ హనుమంతును ఆహ్వానించారు. రెండేళ్లు శ్రమించిన తర్వాత పసుపు పరిశ్రమను ఎట్టకేలకు ప్రారంభించుకోవడం పై ఎఫ్పీవో సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పండించిన పసుపు పంటను మార్కెట్కు వెళ్లి విక్రయించడానికి రైతులు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో స్వయంగా పసుపు క్లస్టర్ను ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. పంటను పండించి దానికి రేటు కట్టి విదేశాలకు ఎగుమతి చేయాలని భావించారు. అనుకున్నట్లుగానే జక్రాన్పల్లి, మనోహరాబాద్, కలిగోట్, పడకల్, మైలారం గ్రామాల నుంచి 600 మంది రైతులు పోగయ్యారు. జేఎంకేపీఎం పేరుతో మనోహరాబాద్లో అర ఎకరం స్థలాన్ని ఎంపిక చేసి సొంతగా పసుపు పరిశ్రమ కోసం 2023లో పనులు ప్రారంభించారు.
ఇందుకు కేంద్ర ప్రభుత్వ ఆత్మ నిర్భర్ పథకం కింద రుణసాయం పొందారు. పసుపు ఉడకబెట్టే, పాలిష్ చేసే, గ్రేడింగ్ చేసే, పసుపు ఆకులతో ఆయిల్ తీసే యంత్రాలను కొనుగోలు చేశారు. గోదాములు నిర్మించుకున్నారు. ప్రారంభోత్సవానికి అంతా సిద్ధం చేసుకుని ఉత్పత్తులు ఎగుమతి చేయడానికి ఒప్పందాలను చేసుకున్నారు. మొదటి సారిగా ‘ఇందూరు పసుపు’ బ్రాండ్ పేరుతో ఆర్మూర్ పసుపు పొడిని ఈజిప్టు దేశానికి ఎగుమతి చేయనున్నారు. ఏడాదిలో రూ.100 కోట్లు, ఐదేళ్లలో రూ.500 కోట్ల టర్నోవర్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు రైతు ఉత్పత్తిదారుల సంఘం బాధ్యుడు పాట్కూరి తిరుపతి రెడ్డి వెల్లడించారు. మార్కెటింగ్ను విస్తృతం చేస్తామని పసుపు పంట ఉత్పత్తులే కాకుండా భవిష్యత్తులో ఇతర పంటలను కూడా ఎగుమతి చేయాలని ఆలోచన చేస్తున్నామన్నారు.
మనోహరాబాద్లో నేడు
ప్రారంభించనున్న ఎంపీ అర్వింద్
600 మంది రైతులు కలిసి సొంతంగా ఏర్పాటు చేసుకున్న యూనిట్
పసుపు ఉడకబెట్టే, పాలిష్ చేసే,
గ్రేడింగ్ చేసే, పసుపు ఆకులతో
ఆయిల్ తీసే యంత్రాల కొనుగోలు, గోదాముల నిర్మాణం
‘ఇందూరు పసుపు’ బ్రాండ్ పేరుతో ఈజిప్టు దేశానికి పసుపు పొడి ఎగుమతి
తొలి పసుపు పరిశ్రమ!
తొలి పసుపు పరిశ్రమ!


