● ఇళ్ల నిర్మాణం పూర్తయినా పంపిణీ చేయని వైనం
● ఆగ్రహించి ఇళ్లల్లోకి చొరబడిన స్థానికులు
● ఇళ్లు సీజ్ చేసి, తాళాలు వేసిన
అధికారులు
ధర్పల్లి: పేదల సొంతింటి కల నెరవేరేస్తామంటూ గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన డబుల్ బెడ్ రూం ఇళ్ల పథకం నిరుపేదల ఆశలను ఆవిరి చేశాయి. నిర్మాణం పూర్తయి మూడేళ్లు గడుస్తున్నా లబ్ధిదారులకు పంపిణీ చేయకపోవడంతో వృథాగా ఉండిపోతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో ధర్పల్లి మండల కేంద్రంలో 48 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను నిర్మించారు. ఒక్కొక్క ఇంటికి రూ.6 లక్షల చొప్పున రూ.2.88 కోట్లు కేటాయించారు. మూడేళ్ల క్రితం నిర్మాణ పనులు పూర్తయ్యాయి. చిన్నపాటి పనులు చేయాల్సి ఉంది. ఇళ్లు పంపిణీకి నోచుకోక వృథాగా ఉంటున్నాయి. అర్హులను గుర్తించే సమయంలో అసెంబ్లీ ఎన్నికలు రావడంతో ఇళ్ల పంపిణీ ప్రక్రియ నిలిచిపోయింది. ఈ ఇళ్లలో డ్రైనేజీలు, రోడ్డు నిర్మాణం, విద్యుత్, మంచినీటి సౌకర్యాలు కల్పించాలి. ఇప్పుడు ఈ సమస్యను పట్టించుకునే వారు కరువయ్యారు. గ్రామానికి చెందిన నిరుపేదలు ప్రజా సంఘాల నాయకులతో కలిసి ఉన్నతాధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లి వినతి పత్రాలను కూడా అందజేశారు. ప్రభుత్వం చొరవ తీసుకొని డబుల్ బెడ్ రూమ్ ఇళ్లల్లో మౌలిక సదుపాయాలను కల్పించి, అర్హులను గుర్తించి ఇళ్లను పంపిణీ చేయాలని నిరుపేదలు కోరుతున్నారు.
ఇళ్ల ఆక్రమణ..
ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పంపిణీ చేయకపోవడంతో పది రోజుల క్రితం అసహనానికి గురైన 30 మంది నిరుపేద కుటుంబాలు ఇళ్లల్లోకి ప్రవేశించి, సామగ్రిని భద్రపరచుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు, రెవెన్యూ అధికారులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని ఇళ్ల పంపిణీ చేయకుండా చొరబడడం చట్ట విరుద్ధమని ప్రజలకు వివరించారు. మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని త్వరలో లబ్ధిదారులను ఎంపిక చేసి ఇళ్లను కేటాయిస్తామన్నారు. ఇళ్లల్లోకి చొరబడిన వారిని అధికారులు సముదాయించి బయటకు పంపించారు. అనంతరం రెవెన్యూ అధికారులు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను సీజ్ చేసి తాళాలు వేశారు.
కిరాయికి ఉంటున్నాం
మాకు ఉండడానికి సొంత ఇల్లు లేదు. ఎన్నో ఏళ్ల నుంచి కిరాయికి ఉంటూ జీవిస్తున్నాం. బీడీలు చుట్టగా వచ్చిన డబ్బులతోనే ఇంటి కిరాయి కట్టుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాను. గతంలో చాలాసార్లు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కోసం దరఖాస్తు పెట్టుకున్నాను. ఇప్పటికై నా అధికారులు స్పందించి ఇల్లు ఇవ్వాలని కోరుతున్నాం. – సబ్బని లక్ష్మి, ధర్పల్లి
ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం
ధర్పల్లిలోని డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలో డ్రైనేజ్, సీసీ రోడ్డు, కరెంట్, మంచినీటి సౌకర్యాలను కల్పించాల్సి ఉంది. పూర్తిస్థాయిలో పనులు కాలేవు. త్వరలోనే అసలైన అర్హులను గుర్తించి ఉన్నతాధికారుల సమక్షంలోనే పంపిణీ చేస్తాం. అప్పటివరకు ఎవరు ఇళ్లను ఆక్రమించొద్దు. అది చట్టరీత్యా నేరం అవుతుంది.
– మాలతి, తహసీల్దార్ , ధర్పల్లి
డబుల్ ఇళ్ల పంపిణీ ఎప్పుడో?
డబుల్ ఇళ్ల పంపిణీ ఎప్పుడో?
డబుల్ ఇళ్ల పంపిణీ ఎప్పుడో?
డబుల్ ఇళ్ల పంపిణీ ఎప్పుడో?