Sakshi News home page

కస్టం మిల్లింగ్‌ కహానీ..

Published Mon, Jan 15 2024 1:02 AM

- - Sakshi

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌: జిల్లా నుంచి ఇవ్వాల్సిన కస్టం మిల్లింగ్‌ రైస్‌ను మిల్లర్లు ఇప్పటివరకు ప్రభుత్వానికి పూర్తిస్థాయిలో ఇవ్వలేదు. జిల్లాలోని మొత్తం 62 పారాబాయిల్డ్‌, 218 ముడిరైస్‌ మిల్లులున్నాయి. ఈ మిల్లులకు పౌరసరఫరాల శాఖ ద్వారా కేటాయించిన ధాన్యానికి సంబంధించి కస్టం మి ల్లింగ్‌ రైస్‌ ఇవ్వకపోవడంతో సమస్య తలెత్తుతోంది. వివరాల్లోకి వెళ్తే.. 2022–23 వానాకాలం సీజన్‌లో జిల్లాలోని మిల్లర్లకు 6,03,872 మెట్రిక్‌ టన్నుల ధాన్యం ప్రభుత్వం ఇచ్చింది. ఈ ధాన్యానికి గాను మిల్లర్లు 4,09,535 మెట్రిక్‌ టన్నుల కస్టం మిల్లింగ్‌ రైస్‌ ఇవ్వాల్సి ఉంది. అయితే 3,87,529 మెట్రిక్‌ టన్నులు ఇచ్చారు. ఇంకా 22,005 మెట్రిక్‌ టన్నులు ఇవ్వాల్సిన సీఎంఆర్‌ పెండింగ్‌ ఉంది.

► 2022–23 యాసంగి సీజన్‌ విషయానికి వస్తే 6,35,190 మెట్రిక్‌ టన్నుల ధాన్యం మిల్లర్లకు ఇచ్చారు. ఇందుకు సంబంధించి 4,32,264 మెట్రిక్‌ టన్నుల కస్టం మిల్లింగ్‌ రైస్‌ ఇవ్వాల్సి ఉంది. అయితే ఇప్పటివరకు కేవలం 1,22,980 మెట్రిక్‌ టన్నుల బియ్యం మాత్రమే ఎఫ్‌సీఐకి ఇచ్చారు. ఇంకా 3,09,284 మెట్రిక్‌ టన్నులు సీఎంఆర్‌ ఇవ్వాల్సింది పెండింగ్‌లో ఉంది. గత ప్రభుత్వం హయాంలో ఇష్టం మిల్లర్లు కొందరు ఇష్టం వచ్చినట్లు మొండికేశారు. మొత్తం జిల్లా వ్యాప్తంగా మొత్తం 3,31,289 మెట్రిక్‌ టన్నుల కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌ ఇవ్వాల్సి ఉంది. కొత్త ప్ర భుత్వం ఈ నెలాఖరులోగా మొత్తం సీఎంఆర్‌ ఇవ్వాలని గడువు పొడిగించింది. అయితే మిల్ల ర్లు మాత్రం ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు.

ధాన్యం మాఫియా..
బోధన్‌ మాజీ ఎమ్మెల్యే షకీల్‌ అధికారంలో ఉన్న సమయంలో చేసిన భారీ అక్రమం ఇటీవల బయటకొచ్చింది. బోధన్‌లోని మాజీ ఎమ్మెల్యే షకీల్‌కు చెందిన రహీల్‌, రాస్‌, అమీర్‌, దాన్విక్‌ అనే నాలుగు రైస్‌మిల్లులకు 2021–22 యాసంగి, 2022–23 వా నాకాలం సీజన్‌లకు సంబంధించి పౌరసరఫరాల శాఖ ద్వారా 50 వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యం ఇచ్చారు. ఇందుకు గాను 35 వేల మెట్రిక్‌ టన్నుల బియ్యం సీఎంఆర్‌ (కష్టం మిల్లింగ్‌ రైస్‌) కింద తిరిగి పౌరసరఫరాల శాఖకు తిరిగి ఇవ్వాల్సి ఉంది. అయితే కేవలం 5 వేల మెట్రిక్‌ టన్నుల బియ్యం మాత్రమే ఇచ్చారు.

మిల్లింగ్‌ చేసి మిగిలిన సీఎంఆర్‌ బియ్యం ఇవ్వడం తనకు సాధ్యం కాదని షకీల్‌ చెప్పాడు. ఈ నేపథ్యంలో మిగిలిన ధాన్యాన్ని ఏఆర్‌ ఇండస్ట్రీస్‌(ఎడపల్లి), ఆర్‌కామ్‌ ఇండస్ట్రీస్‌(వర్ని), అబ్దుల్‌ ఐ ఇండస్ట్రీస్‌(వర్ని), ఎఫ్‌టీఎఫ్‌ ఇండస్ట్రీస్‌ (బోధన్‌) అనే మరో నాలుగు మిల్లులకు కేటాయించినట్లు చూపారు. ఇందుకు సంబంధించి ధాన్యం తమ మిల్లులకు బదిలీ అయినట్లు ఆ నాలుగు మిల్లులకు చెందిన యజమానులు లిఖితపూర్వకంగా రాసిచ్చారు.

ఇందులో ఏఆర్‌ ఇండస్ట్రీస్‌ నుంచి 2,000 మెట్రిక్‌ టన్నులు, ఆర్‌కామ్‌ నుంచి 1,000 మెట్రిక్‌ టన్నులు, అబ్దుల్‌ ఐ నుంచి 1,000 మెట్రిక్‌ టన్నుల బియ్యం (సీఎంఎఆర్‌) మాత్రమే పౌరసరఫరాల శాఖకు ఇచ్చారు. ఎఫ్‌టీఎఫ్‌ ఇండస్ట్రీస్‌ నుంచి ఒక్క గింజ కూడా ఇవ్వలేదు. మిగిలిన 26వేల మెట్రిక్‌ ట న్నుల సీఎంఆర్‌ బి య్యాన్ని ఇవ్వాలని పౌ రసరఫరాల శాఖ అధికారులు అడుగగా, షకీల్‌ మిల్లుల నుంచి తమకు బియ్యం రాలేదని చెబుతుండడం గమనార్హం. మాజీ ఎమ్మెల్యే షకీల్‌ ఒత్తిడితోనే ధాన్యం బదిలీ అయినట్లు తాము రాసిచ్చినట్లు నలుగురు మిల్లర్లు చెబుతుండడం విశేషం. ఈ విషయమై రేవంత్‌ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.

రైస్‌మిల్లుల్లో జరుగుతున్న మోసపూరిత కార్యకలాపాలు, అవినీతి అక్రమాలు బహిర్గతం చేయడానికి ఏకకాలంలో కేంద్ర విజిలెన్స్‌ విచారణ చేప ట్టాలని మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు యెండల లక్ష్మీనారాయణ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు శనివారం హైదరాబాద్‌లోని సివిల్‌ సప్లయ్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ దేవేంద్ర సింగ్‌ చౌహాన్‌కు వినతిపత్రం ఇచ్చారు.

సీఎంఆర్‌ ఇవ్వకపోతే కఠిన చర్యలు
ప్రభుత్వానికి తిరిగివ్వాల్సిన కస్టం మిల్లింగ్‌ రైస్‌ను మిల్లర్లు తక్షణమే ఇవ్వకపోతే కఠినచర్యలు తీసుకుంటాం. కొందరు మిల్లర్ల వైఖరి కారణంగా ప్రభుత్వానికి, రైతుల కు, ఇతర మిల్లర్లకు చెడ్డపేరు వస్తోంది. కొందరు మిల్లర్లు సీఎంఆర్‌ ఇవ్వకుండా బయట ప్రాంతాల్లో అమ్ముకున్నారు. ఈ విషయంలో సంబంధిత అధికారుల ప్రమేయం ఉన్నట్లు తేలితే చర్యలు ఉంటాయి.

– సుదర్శన్‌ రెడ్డి, మాజీ మంత్రి, ఎమ్మెల్యే

Advertisement

What’s your opinion

Advertisement