నిర్మల్చైన్గేట్: అంగన్వాడీ పోస్టుల భర్తీకి ఎట్టకేల కు గ్రీన్ సిగ్నల్ లభించింది. మూడు, నాలుగేళ్లుగా జిల్లాలో వివిధ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అయినప్పటికీ ప్రభుత్వం నుంచి ఆదేశాలు లేకపోవడంతో టీచర్లు, ఆయాలు లేకుండానే కేంద్రాలు నడుస్తున్నాయి. పిల్లల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఖాళీగా ఉన్న టీచర్, ఆయాల పోస్టుల ను భర్తీ చేయాలని నిర్ణయించింది. మొదటి విడతగా జిల్లాలోని టీచర్ల పోస్టులకు జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రకటన విడుదలైంది.
తొలివిడత టీచర్ పోస్టులే..
జిల్లాలోని ఐదు ప్రాజెక్టుల పరిధిలో మొత్తం 89 టీచర్, 459 ఆయా పోస్టులు ఖాళీగా ఉండగా, ప్రస్తుతం 89 టీచర్ పోస్టులను మాత్రమే భర్తీ చేయనున్నారు. ఏళ్లుగా సిబ్బంది లేక చిన్నారులకు ప్రీస్కూల్ విద్య, పోషకాహార పంపిణీ, గర్భిణులు, బాలింతలకు అందాల్సిన సేవలు, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల అమలుపై ప్రభావం పడింది.
30 వరకు దరఖాస్తుల స్వీకరణ
మొత్తం 89 పోస్టుల భర్తీకి శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆన్లైన్ విధానంలో ఈనెల 15 నుంచి 30వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. కనీస విద్యార్హత ఇంటర్మీడియట్గా నిర్ణయించింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 18 ఏళ్ల నుంచి 35 ఏళ్లలోపు వయసు ఉండాలి. అభ్యర్థి ఏ అంగన్వాడీ కేంద్రానికి దరఖాస్తు చేసుకుంటున్నారో.. ఆ గ్రామం, హాబిటేషన్, వార్డు నివాసై ఉండా లి. ఎంపిక విధానంలో ఇంటర్మీడియట్ మార్కుల మెరిట్, జిల్లా సెలక్షన్ కమిటీ నిర్వహించే ఇంట ర్వ్యూలకు రోస్టర్ నిబంధనలు పాటించి ఎంపిక చేయనున్నారు.
దళారులను ఆశ్రయించొద్దు..
జిల్లాలో తొలివిడతగా 89 టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. నియామక ప్రక్రియ పూర్తి పారదర్శకంగా ఉంటుంది. దళారులను నమ్మి మోసపోవద్దు. ఈ నెల 30 వరకు అర్హులైన మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి.
–వినూత్న, డీడబ్ల్యూవో


