ధరణి ఆపరేటర్లపై తొలగింపు కత్తి | - | Sakshi
Sakshi News home page

ధరణి ఆపరేటర్లపై తొలగింపు కత్తి

Aug 8 2026 1:35 AM | Updated on Aug 8 2026 1:35 AM

● 15 నెలలుగా అందని వేతనాలు ● ఆందోళనలో కంప్యూటర్‌ ఆపరేటర్లు ● జూనియర్‌ అసిస్టెంట్ల చేతికి భూభారతి

భూభారతి ఎఫ్‌టీఎస్‌ ఆపరేటర్లను యథావిధిగా కొనసాగించాలి.

290 మంది తొలగింపు ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలి.

15 నెలల పెండింగ్‌ వేతనాలు వెంటనే చెల్లించాలి.

ప్రతీనెల 1వ తేదీన వేతనాలు చెల్లించాలి.

నిర్మల్‌చైన్‌గేట్‌:ధరణి ఆపరేటర్ల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. భూభారతి అమలుతో వారి ఉద్యోగాలపై తొలగింపు కత్తి వేలాడుతోంది. తహసీల్దార్‌ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్‌ బాధ్యతలను జూనియర్‌ అసిస్టెంట్లకు అప్పగించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. దీంతో ఔట్‌సోర్సింగ్‌ విధానంలో ఇప్పటివరకు పనిచేస్తున్న ధరణి ఆపరేటర్లను తొలగించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది.

రాష్ట్ర వ్యాప్తంగా 632 మంది..

గత ప్రభుత్వం 2018లో ధరణి పోర్టల్‌ను తీసుకువచ్చింది. తహసీల్దార్‌ కార్యాలయాల్లో భూముల రిజిస్ట్రేషన్‌ చేయాలని నిర్ణయించింది. రిజిస్ట్రేషన్‌ ఆపరేటర్లుగా ఔట్‌సోర్సింగ్‌ ద్వారా నియమించింది. సెంట్రిక్‌ సంస్థ ద్వారా ఆపరేటర్లు 2018 మే 23న విధుల్లో చేరారు. రాష్ట్రవ్యాప్తంగా 632 మంది ఆపరేటర్లను చేర్చుకున్నారు. వీరిని ఏటా మార్చి, ఏప్రిల్‌ మధ్యలో రెన్యువల్‌ చేసేవారు. ముందుగా నెలకు రూ.11 వేల వేతనం ఇచ్చారు. ఆ తర్వాత రూ.13 వేలకు పెంచారు. గత ప్రభుత్వం చివరి దశలో నెలవారీ వేతనాన్ని రూ.21,500కు పెంచుతామని హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆపరేటర్లను టీజీటీఎస్‌ కింద తీసుకుని నెలకు రూ.21,500 వేతనం ఇస్తోంది. అయితే దీన్ని నెలవారీగా ఇవ్వకుండా మూడు లేదా ఆరు నెలలకు ఒకసారి విడుదల చేస్తున్నారు.

ఆపరేటర్ల ఆందోళన బాట..

భూభారతి ఆపరేటర్ల స్థానంలో జూనియర్‌ అసిస్టెంట్లను నియమిస్తున్నారన్న అనుమానంతో రెండు రోజులుగా ఆపరేటర్లు ఆందోళన బాట పట్టారు. సోమవారం కలెక్టరేట్‌, ఆర్డీవో కార్యాలయాల ఎదుట నిరసన వ్యక్తం చేసి అధికారులకు వినతిపత్రాలు అందజేశారు. మంగళవారం రాష్ట్రంలోని ఆపరేటర్లందరూ హైదరాబాద్‌లోని గాంధీభవన్‌కు వెళ్లి నిరసన చేపట్టి తమ గోడు వినిపించారు. సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకులు వీహెచ్‌, జగ్గారెడ్డిని కలిసి తమకు న్యాయం చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, పెండింగ్‌ వేతనాలు ఇవ్వాలని విన్నవించారు.

పెండింగ్‌లో 15 నెలల వేతనాలు

ఆపరేటర్ల ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగాన్ని ఏటా మార్చి, ఏప్రిల్‌ నెలలో రెన్యువల్‌ చేసేవారు. అయితే ఈ ఏడాది అలా చేయలేదని ఆపరేటర్లు తెలిపారు. ఈ విషయాన్ని పలుమార్లు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినా దాటవేత ధోరణితో వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. పైగా తమకు 15 నెలల నుంచి వేతనాలు కూడా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

కొనసాగించాలి..

ఎఫ్‌టీఎఫ్‌ ఉద్యోగులను రెన్యూవల్‌ చేసి యథావిధిగా కొనసాగించాలి. ఉద్యోగులను తగ్గించే ఆలోచనను ప్రభుత్వం ఉపసంహరించుకోవాలి. పెండింగ్‌లో ఉన్న వేతనాలు తక్షణమే విడుదల చేయాలి. ఎన్టీఎస్‌ ఉద్యోగుల వివరాలు ఐఎఫ్‌ఎం ఐఎస్‌ పోర్టల్‌లో నమోదు చేయాలి. – పోశెట్టి, భూభారతి ఆపరేటర్ల సంఘం

జిల్లా ఉపాధ్యక్షుడు

ఆపరేటర్ల డిమాండ్లు:

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement