కడెం/ఖానాపూర్: భారీ వర్షాల నేపథ్యంలో కడెం ప్రాజెక్టు పరిసర ప్రాంతాల ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. కడెం ప్రాజెక్టును, ఖానాపూర్ పట్టణంలోని వర్షాల కారణంగా దెబ్బతిన్న రహదారిని శుక్రవారం సందర్శించారు. కడెం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం, ప్రస్తుత నీటి నిల్వ, ఇన్ఫ్లో, ఔట్ఫ్లో వివరాలు ఇరిగేషన్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్టు దిగువ ప్రాంతాల గ్రామాల ప్రజలకు నీటి విడుదలకు సంబంధించిన సమాచారాన్ని ముందుగానే అందించి అప్రమత్తం చేయాలని సూచించారు. ప్రాజెక్టు అధికారులు నిరంతరం అందుబాటులో ఉంటూ నీటి మట్టం, ప్రవాహ పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు. ప్రాజెక్టు గేట్లు, నీటి ప్రవాహ ప్రాంతాలు, ఇతర ప్రమాదకర ప్రాంతాల్లోకి అనధికార వ్యక్తులు ప్రవేశించకుండా భద్రతా చర్యలు చేపట్టాలని కలెక్టర్ సూచించారు. ఖానాపూర్లో వసతి గృహ విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా నిత్యావసర వస్తువులు, అవసరమైన సామగ్రిని నిరంతరం అందించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. కలెక్టర వెంట సీఈ జగదీశ్, ఎస్ఈ రాజేంద్రప్రసాద్, ఈఈ ప్రవీణ్కుమార్, డీఈ వీరన్న, తహసీల్దార్ ఖాజా మొయినుద్దీన్ ఖానాపూర్ మున్సిపల్ చైర్పర్సన్ అంకం మౌనిక, మున్సిపల్ కమిషనర్ సుందర్ సింగ్, ఎంపీడీవో రాధ రాథోడ్, వివిధ శాఖల అధికారులు ఉన్నారు.


