భైంసా: సన్నవడ్ల బోనస్ కోసం జిల్లా రైతులు ఏడాదిగా ఎదురుచూస్తున్నారు. ఈ ఏడాది వానాకాలంలో సన్నవడ్లు విక్రయించిన రైతులకు బోనస్ చెల్లించిన ప్రభుత్వం గత యాసంగిలో విక్రయించినవారికి మాత్రం నేటికీ చెల్లించలేదు. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో 4,483 మంది రైతులు సన్నవడ్లు విక్రయించగా, వీరికి రూ.12.81 కోట్ల బోనస్ చెల్లించాల్సి ఉంది.
సన్నాల సాగులో ఐదువేల మందే..
జిల్లాలో 70వేల ఎకరాల్లో రైతులు రెండు సీజన్లలో వరి పండిస్తారు. దొడ్డురకం ఎకరానికి 25 నుంచి 30 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. అదే సన్నరకం పండిస్తే 16 నుంచి 23 క్వింటాళ్లే వస్తుంది. పైగా సన్నాల సాగులో చీడపీడల బెడద ఎక్కువగా ఉంటుంది. పెట్టుబడి ఖర్చులు కూడా ఎక్కువే. దొడ్డురకం పంట 110 రోజుల్లో వస్తుండగా, సన్నరకం పంట 130 నుంచి 150రోజుల సమయం పడుతుంది. దీంతో సన్నవడ్లు పండించే రైతులు జిల్లాలో 5వేల మంది మాత్రమే ఉన్నారు.
సాగు చేయాలా.. వద్దా?
ఈ ఖరీఫ్లో సన్నవడ్లకు బోనస్ చెల్లించిన ప్రభుత్వం గత యాసంగికి సంబంధించి పెండింగ్లో పె ట్టింది. దీంతో ఈ యాసంగిలో సన్నాలు సాగు చేసి న రైతుల్లో అయోమయం నెలకొంది. గతేడాదిలాగే బోనస్ నిలిపివేస్తారా? చెల్లిస్తారా? అనే విషయం తెలియక ఆందోళనకు గరవుతున్నారు. కాగా, జిల్లాలో వానాకాలంలో 63వేల ఎకరాల్లో సాగు చేసిన సోయా భారీ వర్షాలతో దెబ్బతింది. మార్క్ఫెడ్ ఆ ధ్వర్యంలో జిల్లాలో 2,38,450 క్వింటాళ్లను నాఫెడ్ కొనుగోలు చేశారు. సోయా రైతులకు రూ.51కోట్లు రావాల్సి ఉండగా ఇప్పటికీ చెల్లింపులు లేవు.
ఇప్పటివరకు జమకాలేదు
గత యాసంగిలో జిల్లాలోని కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల నుంచి సన్నవడ్లు సేకరించాం. ధాన్యం డబ్బులు రైతుల ఖాతాల్లో జమ చేశాం. కానీ, బోనస్ డబ్బులు ఇప్పటివరకై తే జమకాలేదు.
– సుధాకర్, పౌరసరఫరాలశాఖ డీఎం


