భైంసాటౌన్: బాధితులకు సత్వర న్యాయం అందేలా ఫిర్యాదులు త్వరగా పరిష్కరించాలని ఎస్పీ డాక్టర్ జీ జానకీ షర్మిల సూచించారు. పట్టణంలోని క్యాంప్ కార్యాలయంలో బుధవారం ప్రజావాణి నిర్వహించారు. ఈ సందర్భంగా భైంసా సబ్ డివిజన్ పరిధిలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఆరుగురి నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. వాటిని పరిష్కరించాలని సంబంధిత ఎస్హెచ్వోలను ఆదేశించారు. బాధితులకు చట్టపరంగా అవసరమైన సహాయం అందించాలని సూచించారు. అనంతరం కుటుంబ వివాదాల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన భరోసా కేంద్రాన్ని తనిఖీ చేశారు. కౌన్సిలింగ్ ద్వారా కుటుంబాలు తిరిగి కలుసుకోవడంలో షీటీం పాత్రను ప్రశంసించారు.
వేగం పెంచాలి
ఈ సందర్భంగా గతంలో గ్రీవెన్స్లో వచ్చిన ఫిర్యాదుల పరిష్కార స్థితి, పెండింగ్ ఫిర్యాదుల పురోగతి గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. పెండింగ్ కేసుల పరిష్కారంలో వేగం పెంచాలని వారికి సూచించారు. భైంసా ఏఎస్పీ రాజేశ్మీనా ఉన్నారు.


