
ఫుల్ గి‘రాఖీ’
● ఆర్టీసీకి కలిసి వచ్చిన వరుస సెలవులు ● ‘పౌర్ణమి’ రోజున రూ.2.89 కోట్ల ఆదాయం ● రీజియన్ వ్యాప్తంగా రూ.9.26 కోట్ల ఆమ్దాని
ఆదిలాబాద్: వరుస సెలవులు, పండుగలు ప్రజా రవాణా సంస్థకు ఆదాయాన్ని తెచ్చిపెట్టాయి. ఈనెల 8న వరలక్ష్మీ వ్రతం, 9న రాఖీపౌర్ణమి, 10న ఆదివారం కలిసి రావడంతో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికుల తాకిడి ఒక్కసారిగా పెరిగింది. ఈ నెల 7నుంచి 11వరకు రీజియన్ వ్యాప్తంగా ఆక్యూపెన్సీ రేషియో(ఓఆర్) 101 నమోదవడం రద్దీ తీరుకు నిదర్శనం. ఉమ్మడి ఆదిలాబాద్లోని ఆరు డిపోల పరిధిలో ఐదు రోజుల వ్యవధిలో ప్రతీ కిలోమీటర్కు రూ.66.48 ఆదాయం వచ్చింది. మొత్తం 639 బస్సులు 13,93,000 కిలోమీటర్లు తిరిగి 18.84 లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చారు. జూలై నెలలో ఒక్క సాధారణ రోజు ఇన్కమ్ రూ.1.85 కోట్లుగా ఉంది. అయితే రాఖీ పండుగ ఒక్కరోజే రీజియన్ వ్యాప్తంగా రూ.2.89 కోట్ల ఆదాయం సమకూరడం విశేషం. గతేడాది ఈ పండుగకు రూ.1.57 కోట్ల ఆదాయం రాగా ఈ సారి అదనంగా మరో రూ.1.32 కోట్లను ఆర్జించి ఆర్టీసీ రికార్డు సృష్టించింది. మొత్తంగా ఐదు రోజుల్లో రీజియన్ పరిధిలో రూ.9.26 కోట్ల ఆదాయం వచ్చింది. ఇందులో అత్యధికంగా నిర్మల్ డిపో రూ. 2.49 కోట్లతో అగ్రస్థానంలో నిలిచింది.
‘మహాలక్ష్మి’లే అధికం..
తమ సోదరులకు రాఖీ కట్టేందుకు దూర ప్రయాణమైనా మహిళలు ఆర్టీసీలో ప్రయాణించడం సంస్థకు లాభించింది. ఐదు రోజుల వ్యవధిలో మొత్తం 18.84 లక్షల మంది ప్రయాణించగా, అందులో 12.60 లక్షల మంది ‘మహాలక్ష్మి’లే ఉన్నారు. అత్యధికంగా పౌర్ణమి రోజున 4.27 లక్షల మంది ప్రయాణించగా, ఇందులో 2.93 లక్షల మంది మహాలక్ష్మి లబ్ధిదారులున్నారు. ఇక ఆక్యూపెన్సీ రేషియో విషయానికి వస్తే ఉట్నూరు డిపో పరిధిలో అత్యధికంగా 109 ఉండగా, నిర్మల్ 106, భైంసా 102, ఆదిలాబాద్ 101, మంచిర్యాల 97, ఆసిఫాబాద్ 95గా నమోదయ్యాయి.
అగ్రస్థానంలో నిర్మల్ డిపో..
ఐదు రోజుల్లో నిర్మల్ డిపో రూ.2.49 కోట్ల ఆదాయంతో అగ్రస్థానంలో నిలిచింది. గతేడాది రూ.1.25 కోట్లతో సరిపెట్టుకోగా, ఈసారి రెట్టింపు సమకూర్చుకోవడం విశేషం. గతంలో రూ.కోటి 80 వేల ఆదాయంతో నిలిచిన ఆదిలాబాద్ ఈసారి పుంజుకుని రూ.2.15 కోట్లకు చేరుకుంది.
ముందస్తు ప్రణాళికతో..
వరుసగా రెండు పండుగలు, ఆదివారం కూడా తోడవడంతో రద్దీని ముందే పసిగట్టిన ఆర్టీసీ అధికారులు పకడ్బందీ ప్రణాళికతో ముందుకు సాగారు. ఉమ్మడి జిల్లాకు సరిహద్దున ఉన్న మహారాష్ట్ర ప్రాంతాలతో పాటు ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, మెదక్, హైదరాబాద్ వంటి ప్రాంతాల నుంచి ప్రయాణికుల రాకపోకలు ఎక్కువగా ఉంటాయి. తదనుగుణంగా యాజమాన్యం ప్రత్యేక బస్సులను నడిపింది. ముఖ్యంగా హైదరాబాద్కు 118 స్పెషల్ సర్వీస్లను ఏర్పాటు చేశారు. రద్దీకి అనుగుణంగా 7, 8 తేదీల్లో హైదరాబాద్ నుంచి ఉమ్మడి ఆదిలాబాద్లోని వివిధ ప్రాంతాలకు 46 బస్సులు ఏర్పాటు చేయగా, 10 నుంచి 12వ తేదీ వరకు రీజియన్ నుంచి హైదరాబాద్కు 72 బస్సులను ఆపరేట్ చేశారు. అంతేకాకుండా ప్రయాణికుల సౌకర్యార్థం హెల్ప్డెస్క్లను అందుబాటులో ఉంచారు. అలాగే ఉద్యోగుల ఇబ్బందులను సైతం పరిగణలోనికి తీసుకొని ఈ సారి వారికి ప్రత్యేక భోజన వసతి ఏర్పాటు చేశారు. ఫలితంగా ప్రయాణికులు సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవడంతోపాటు ఆర్టీసీకి ఆమ్దాని వచ్చింది.
ప్రయాణికులను సురక్షితంగా చేర్చాం..
వరలక్ష్మీ వ్రతం, రాఖీ పండుగలను దృష్టిలో ఉంచుకొని ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా బస్సులను ఆపరేట్ చేశాం. సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాం. ఉద్యోగులు ఎంతగానో కృషి చేశారు. ఆదాయం సైతం గతంతో పోలిస్తే ఘననీయంగా పెరిగింది. ప్రయాణికులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తాం. – ఎస్. భవానీప్రసాద్,
ఆర్ఎం, ఆదిలాబాద్
రీజియన్ పరిధిలో ఇలా..
(ఈనెల 7 నుంచి 11వ తేదీ వరకు)
డిపో బస్సులు ఆదాయం
ప్రయాణించిన (రూ.కోట్లలో)
కి.మీ(లక్షల్లో)
ఆదిలాబాద్ 3.22 2.15
భైంసా 1.47 0.90
నిర్మల్ 3.47 2.49
ఉట్నూర్ 0.77 0.53
ఆసిఫాబాద్ 1.69 1.06
మంచిర్యాల 3.31 2.13
రీజియన్ 13.93 9.26

ఫుల్ గి‘రాఖీ’