
కొనుగోలు కేంద్రం కోసం రోడ్డెక్కిన రైతులు
లక్ష్మణచాంద:మండలంలోని పొట్టపల్లి గ్రామ రైతులు తమ గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని కోరుతూ గురువారం ఆందోళనకు దిగారు. మండల కేంద్రానికి వెళ్లే ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ, గ్రామంలో కోతలు పూర్తి చేసి ధాన్యాన్ని రోడ్డుపై ఆరబెట్టామని, కొందరు రైతుల వరి ధాన్యం ఇప్పటికే ఆరిపోయినప్పటికీ, ప్రభుత్వం గ్రామంలో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు.
రెండేళ్లుగా ఇదే సమస్య
గతంలో పొట్టపల్లి గ్రామంలో ఎఫ్ఎస్సీఎస్ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి ధాన్యాన్ని కొనుగోలు చేసేవారని రైతులు తెలిపారు. అయితే, రెండేళ్లుగా ప్రభుత్వం నుంచి ఎటువంటి అనుమతి రాకపోవడంతో ఎఫ్ఎస్సీఎస్ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడం లేదన్నారు. దీంతో వానాకాలం, యాసంగి పంటలు చేతికి వచ్చిన సమయంలో కొనుగోలు కేంద్రం కోసం రైతులు నిరీక్షించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. పక్క గ్రామాల కొనుగోలు కేంద్రాల వారిని బతిమాలి, సబ్సెంటర్ ఏర్పాటు చేయించి ధాన్యాన్ని అమ్ముకుంటున్నామని, గత రెండేళ్లుగా ఈ తంతు కొనసాగుతోందని రైతులు పేర్కొన్నారు. తమ గ్రామానికి పీఏసీఎస్, ఐకేపీ లేదా ఇతర కొనుగోలు కేంద్రం మంజూరు చేసి రైతుల ఇబ్బందులను తొలగించాలని కోరారు.
తహసీల్దార్ హామీతో ఆందోళన విరమణ
తహసీల్దార్ కొనుగోలు కేంద్రం ఏర్పాటుపై హామీ ఇచ్చే వరకు ఆందోళన విరమించేది లేదని రైతులు పట్టుబట్టారు. దీంతో మండల కేంద్రం నుంచి నిర్మల్కు, నిర్మల్ నుంచి మండల కేంద్రానికి వెళ్లే వాహనాలు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న ఎస్సై మాలిక్ రెహమాన్ సంఘటనా స్థలానికి చేరుకొని రైతులతో చర్చించారు. రైతులు హామీ కోరడంతో ఎస్సై తహసీల్దార్ జానకితో ఫోన్లో మాట్లాడారు. రైతులతో సంభాషించేలా చేశారు. కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేస్తామని తహసీల్దార్ జానకి హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు.