
పంటల కొనుగోలులో ఇబ్బందులు తలెత్తొద్దు
● రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి
నిర్మల్చైన్గేట్: యాసంగి పంటల కొనుగోలులో రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్ డీఎస్.చౌహాన్తో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లు, అధికారులతో శనివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాల వారీగా ఇప్పటివరకు కొనుగోలు చేసిన ధాన్యం వివరాలు అడిగి తెలుసుకున్నారు. వరి ధాన్యంలో తరుగు పేరిట ఎలాంటి కోతలు పెట్టొద్దని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురిసే పరిస్థితులు ఉన్నందున ధాన్యం తడవకుండా జాగ్రత్తలను తీసుకోవాలన్నా రు. దేశంలో అత్యధికంగా వరి పండిస్తున్న రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించిందన్నారు. వానాకాలం పంట కొనుగోలు సజావుగా, ఇబ్బందులు లేకుండా నిర్వహించినందుకు అధికారులందరికీ అభినందనలు తెలిపారు. అనంతరం కలెక్టర్ అభిలాష అభినవ్ మాట్లాడుతూ, జిల్లాలో ఇప్పటికే వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని, జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియకు సంబంధించిన వివరాలను మంత్రికి కలెక్టర్ తెలియజేశారు. నిర్ణీత సమయానికి కొనుగోళ్లు పూర్తి చేస్తామన్నారు. వీడియో కాన్ఫరెన్స్లో మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్, అదనపు కలెక్టర్(రెవెన్యూ) కిశోర్కుమార్, ఆర్డీవో కోమల్రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.