
అణగారిన వర్గాల ఆశాజ్యోతి పూలే
● అదనపు కలెక్టర్ కిశోర్ కుమార్ ● కలెక్టరేట్లో ఘనంగా జయంతి వేడుకలు
నిర్మల్చైన్గేట్: అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయుడు మహాత్మా జ్యోతిబాపూలే అని అదనపు కలెక్టర్ కిశోర్కుమార్ అన్నారు. పూలే జయంతి వేడుకలను కలెక్టరేట్లో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా అదనపు కలెక్టర్లు, ఇతర జిల్లా అధికారులు జ్యోతిబాపూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ కిశోర్కుమార్ మాట్లాడుతూ అంటరానితనం, కులవివక్ష వంటి సామాజిక రుగ్మతలను నిర్మూలించేందుకు పూలే పోరాడారన్నారు. నాటి కాలంలో ఉన్న వివక్షకు వ్యతిరేకంగా పోరాడి మహిళల అభ్యున్నతికి పాటుపడ్డారన్నారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ మాట్లాడుతూ మహాత్మా జ్యోతిబాపూలే తన భార్య సావిత్రిబాయి పూలేతో కలిసి మహిళల విద్యకు కృషి చేశారన్నారు. మహిళా విద్యను ప్రోత్సహించడానికి దేశంలోనే తొలి బాలిక పాఠశాలను ప్రారంభించారని తెలిపారు. పూలే జీవిత చరిత్రను భావితరాలకు తెలియజేయాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మహనీయుల జయంతి వేడుకలు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం గొప్ప విషయమన్నారు. జిల్లా కేంద్రంలో జ్యోతిబాపూలే భవనం, విగ్రహం ఏర్పాటు కోసం పలువురు సంఘ నాయకులు అధికారులకు విజ్ఞప్తి చేయగా, జ్యోతిబాపూలే భవన ఏర్పాటు దిశగా ప్రయత్నం చేస్తామని అదనపు కలెక్టర్లు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల అధికారి శ్రీనివాస్, ఎస్సీ సంక్షేమ అధికారి రాజేశ్వర్గౌడ్, మైనారిటీ అధికారి మోహన్ సింగ్, సీపీవో జీవరత్నం, ఎల్డీఎం రామ్గోపాల్, జిల్లా పరిశ్రమల మేనేజర్ నరసింహారెడ్డి, వివిధ కుల సంఘాల నాయకులు నర్సాగౌడ్, భాస్కర్, ప్రభాకర్, మనోజ్, ముడుగు సత్యనారాయణగౌడ్, నాయకులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఆర్జీయూకేటీలో..
బాసర:బాసరలోని ఆర్జీయూకేటీలో మహాత్మా జ్యోతిబాపూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇన్చార్జి వీసీ ప్రొఫెసర్ గోవర్ధన్ ముఖ్య అతిథిగా హాజరై పూలే చిత్ర పటానికి పూల మాలవేసి నివాళులర్పించారు.పూలే సంఘ సంస్కర్తగా చేసిన కృషిని, విద్యా విప్లవానికి తీసుకువచ్చిన మార్గదర్శనాన్ని వివరించారు. కులమత ఆధిపత్యాలకు వ్యతిరేకంగా పోరాడిన పూలే వంటి మహోన్నతులను స్మరించుకోవడం అవసరమన్నారు. అనంతరం మహనీయుల జయంతి ఉత్సవాల పోస్టర్ను విడుదల చేశారు. ఏప్రిల్ 14 అంబేద్కర్ జయంతి సందర్భంగా వ్యాసరచన, వక్తృత్వ పోటీలు, డాక్యుమెంటరీ, పోస్టర్ ప్రజెంటేషన్, స్కిట్స్ తదితర పోటీలు నిర్వహిస్తామన్నారు. ఓఎస్డీ ప్రొఫెసర్ మురళీధరన్, ఏవో రణధీర్, అసోసియేట్ డీన్ నాగరాజు, నాగాంజనేయులు, సతీశ్కుమార్, డాక్టర్ విజయ్కుమార్, శ్యాంబాబు, రంజిత్కుమార్, శ్యాంసుందర్, లింబాద్రి, నాగలక్ష్మి, విద్యార్థులు పాల్గొన్నారు.
బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో..
బడుగు, బలహీనవర్గాల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిబాపూలే అని బీసీ సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షుడు డాక్టర్ ఉప్పు కృష్ణంరాజు అన్నారు. బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పూలే జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణంరాజు మాట్లాడుతూ జయంతిని ఏప్రిల్ 11న అధికారికంగా నిర్వహించడంతోపాటు సెలవుదినంగా ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. వచ్చే ఏప్రిల్ 11 నాటికి నిర్మల్ నడిబొడ్డున మహాత్మా జ్యోతి బాపూలే దంపతుల విగ్రహాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమ సంఘం జిల్లా కోకన్వీనర్లు కత్రోజు అశోక్చారి, సిరికొండ రమేశ్, జింక లక్ష్మి నారాయణ, కొట్టూరీ కిషన్, అధ్యక్షుడు ఎంబడి చంద్రశేఖర్, నరేందర్ పాల్గొన్నారు.

అణగారిన వర్గాల ఆశాజ్యోతి పూలే

అణగారిన వర్గాల ఆశాజ్యోతి పూలే