ఒకప్పుడు మాఫియాలదే ప్రభుత్వం..యోగీ సంచలన ‍వ్యాఖ్యలు | yogi adityanath says akhilesh must apologise | Sakshi
Sakshi News home page

ఒకప్పుడు మాఫియాలదే ప్రభుత్వం..యోగీ సంచలన ‍వ్యాఖ్యలు

Aug 29 2026 5:16 PM | Updated on Aug 29 2026 5:35 PM

yogi adityanath says akhilesh must apologise

లక్నో: మరో ఆరు నెలల్లో ఉత్తరప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలో ఇప్పటినుంచే పొలిటికల్ హీట్ నెలకొంది. తాజాగా ఆ రాష్ట్ర సీఎం యోగీ ఆదిత్యనాథ్‌, ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎస్పీ అంటేనే దోపిడీ, వసూళ్లు.. దొంగల ముఠా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. సమాజ్‌ వాద్ పార్టీ అధికారంలో ఉండగా రాష్ట్ర ఖజానాను దోచుకున్నారని ఇందుకు గానూ అఖిలేష్ యాదవ్‌ యూపీ ప్రజలకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని యోగీ డిమాండ్ చేశారు.

ఈ రోజు (శనివారం) డియోరియాలో రూ.305 కోట్లకు పైగా విలువైన 80 అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎస్పీపై యోగీ ఆదిత్యనాథ్ తీవ్రస్థాయిలో విరుచుకపడ్డారు. “ఎస్పీ అంటే దోపిడీ, వసూళ్లు. ఎస్పీ అంటే దొంగల ముఠా గత ప్రభుత్వాల హయాంలో ఉత్తరప్రదేశ్‌కు అభివృద్ధి లేకపోవడం, శాంతిభద్రతలు క్షీణించడం, నేరగాళ్ల ప్రభావం పెరగడం వంటి పరిస్థితులు ఉండేవి. ఒకప్పుడు ఉత్తరప్రదేశ్‌లో మాఫియాలదే సమాంతర ప్రభుత్వం. బీజేపీ అధికారంలోకి వచ్చాక  పరిస్థితి పూర్తిగా మారిపోయింది" అన్నారు.

రాష్ట్రంలో మాఫియా వ్యవస్థను అణచివేశామని ఉత్తరప్రదేశ్ ప్రతిష్ఠను మెరుగుపరిచామని చెప్పారు.ఇప్పుడు ఉత్తరప్రదేశ్‌కు మంచి పేరు వచ్చింది. మాఫియాలను మట్టుబెట్టాం. మహిళలు, వ్యాపారుల భద్రతకు భంగం కలిగించే వారికి రెండు చోట్లే స్థానం ఉంది.. ఒకటి జైలు, మరొకటి నరకం అంటూ యోగి ఘాటుగా వ్యాఖ్యానించారు. అభివృద్ధి, సుపరిపాలనకు ప్రజలు ఎన్నుకునే ప్రజాప్రతినిధులే కారణమని ఆయన అన్నారు. మంచి ప్రజాప్రతినిధులను ఎన్నుకుంటే మంచి ప్రభుత్వం వస్తుందని, దాని ఫలితంగానే అభివృద్ధి, సంపద, ఉపాధి అవకాశాలు ప్రజలకు అందుతాయని పేర్కొన్నారు.


ఎన్సెఫలైటిస్ మరణాలపై ఎస్పీ-కాంగ్రెస్‌ను టార్గెట్ చేసిన యోగి

ఈ సందర్భంగా తూర్పు ఉత్తరప్రదేశ్‌ను దశాబ్దాలుగా వెంటాడిన ఎన్సెఫలైటిస్ సమస్యను కూడా యోగి ప్రస్తావించారు. ప్రతి ఏడాది జూలై 15 నుంచి నవంబర్ 15 మధ్య డియోరియా, మహారాజ్‌గంజ్, గోరఖ్‌పూర్, సిద్ధార్థ్‌నగర్, కుషీనగర్, సంత్ కబీర్ నగర్, బస్తీ జిల్లాల్లో ఈ వ్యాధి తీవ్ర ప్రభావం చూపేదని తెలిపారు.ఈ సమస్యను కేవలం వ్యాధిగా చూడలేమని, అప్పటి సమాజ్‌వాదీ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వాల నిర్లక్ష్యానికి ఇది నిదర్శనమని యోగి ఆరోపించారు. 

గత 40 ఏళ్లలో ఎన్సెఫలైటిస్ కారణంగా సుమారు 50 వేల మంది అమాయక చిన్నారులు ప్రాణాలు కోల్పోయారని, కానీ ఎస్పీ లేదా కాంగ్రెస్‌కు చెందిన ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు ఈ పరిస్థితిని పరిశీలించేందుకు కూడా ముందుకు రాలేదని తీవ్రంగా విమర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement