తిరువొత్తియూరు: రాపిడోలో వెళుతున్న సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళా ఇంజినీర్ మృతి చెందారు. ఆవడి సమీపంలోని తిరుముల్లైవాయల్ ప్రాంతానికి చెందిన గోమతి (30) అనే మహిళ ఇంజినీర్గా పనిచేస్తున్నారు. ఈమె రామాపురం ప్రాంతంలోని ఓ ప్రముఖ ఐటీ సంస్థలో ఉద్యోగి. గురువారం ఉదయం ఆమె యధావిధిగా కార్యాలయానికి వెళ్లేందుకు రాపిడో (బైక్ టాక్సీ) బుక్ చేసుకున్నారు. కొద్దిసేపటికే వచ్చిన రాపిడో బైక్ డ్రైవర్, గోమతిని ఎక్కించుకుని మదురవాయల్ బైపాస్ రోడ్డు మీదుగా వెళ్తున్నారు. పోరూర్ టోల్ ప్లాజా సమీపంలో వెళ్తుండగా, ముందు వెళ్తున్న కారును మోటార్ సైకిల్ ఢీకొట్టింది.
ఇందులో నియంత్రణ కోల్పోయిన గోమతి, రాపిడో డ్రైవర్ ఇద్దరూ కింద పడిపోయారు. ఈ ప్రమాదంలో గోమతి తలకి తీవ్ర గాయాలవ్వడంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. గోమతి వద్ద హెల్మెట్ ఉన్నప్పటికీ, ఆమె దానిని ధరించకపోవడమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. రాపిడో డ్రైవర్ స్వల్ప గాయాలతో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. సమాచారం అందుకున్న మదురవాయల్ ట్రాఫిక్ ఇన్వెస్టిగేషన్ విభాగం ఇన్స్పెక్టర్ విజయకుమార్, గోమతి మృతదేహాన్ని స్వా«దీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం కీల్పాకం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అలాగే, ఆ ప్రాంతంలోని సీసీటీవీ కెమెరా ఫుటేజీని సేకరించి, ప్రమాదానికి కారణమై పరారైన వాహనం కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.


