బెంగుళూరు: కట్టుకున్న భార్యను, ఆమె చెల్లెలిని చాకుతో గొంతుకోసి చంపాడో కిరాతకుడు. అక్కడి నుంచి సొంతూరికి పారిపోయాడు. చింతామణి పట్టణం జెజె కాలనీలో సోమవారం ఈ హత్యాకాండ జరిగింది. వివరాలు.. భార్య షమా తాజ్ (27) మరదలు రేష్మా(18)ను హత్య చేశాడు. 8 ఏళ్ల కిందట స్థానికులు అనిత, సర్దార్ దంపతుల కుమార్తెను కోలారు మిలత్ నగరకు ఎజాజ్ (35)కు ఇచ్చి పెళ్లి చేశారు. కొన్ని ఏళ్లు సజావుగా సాగింది, వీరికి ముగ్గురు సంతానం ఉన్నారు. 3 నెలల నుంచి కలహాలు జరుగుతున్నాయి. ఆమె కోలారు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయగా పంచాయతీలు చేశారు.
పుట్టింటికి వచ్చేసినా..
భర్త వేధింపులను తట్టుకోలేక షమా తాజ్ ముగ్గురు పిల్లలను పిలుచుకొని చింతామణిలో పుట్టింటికి వచ్చింది. ఎజాజ్ ఆదివారం రాత్రి ఆమె వద్దకు వచ్చాడు, ఈ సమయంలోనూ రగడ మొదలైంది. ఉదయమే వాగ్వాదం జరిగి, ఎజాజ్ కత్తి పట్టుకుని ఉన్మాదిగా మారి భార్య, ఆమె చెల్లెలిని గొంతు కోసి, ముగ్గురు పిల్లలను పిలుచుకొని కోలారుకు వెళ్లాడు. ఇంటిలో పిల్లలను వదిలి, గల్పేట ఠాణాలో లొంగిపోయాడు.
గంజాయి, ఇస్పేటు అలవాట్లు
చుట్టుపక్కల జనం అనుమానంతో ఇంట్లోకి వెళ్లిచూడగా ఇద్దరి శవాలు రక్తపు మడుగులో పడి ఉన్నాయి. జిల్లా ఎస్పీ కుశాల్ చౌక్సి, అదనపు ఎస్పీ జగన్నాథ్, సీఐ శివరాజ్ పరిశీలించారు. ఎజాజ్ నిత్యం గంజాయి సేవిస్తూ, ఇస్పేటు ఆడుతూ సంసారాన్ని పట్టించుకొనేవాడు కాదని బంధువులు ఆరోపించారు. షమా తల్లిదండ్రులే డబ్బులు పంపేవారని చెప్పారు.


