Sakshi News home page

Singer Shubneet Singh Controversy: పశ్చాత్తాపంలో కెనడియన్ పంజాబీ సింగర్‌!

Published Sat, Sep 23 2023 1:10 PM

Why is Canadian Singer Shubneet Singh In Controversy - Sakshi

భారత్‌- కెనడా సంబంధాలు బీటలువారుతున్న వేళ.. కెనడియన్ పంజాబీ గాయకుడు శుభనీత్ సింగ్ అలియాస్ శుభ్ పేరు ముఖ్యాంశాలలో కనిపిస్తోంది. కొన్ని రోజుల క్రితం శుభ్ సోషల్ మీడియాలో వివాదాస్పద భారతదేశ మ్యాప్‌ షేర్‌ చేశారు. అది మొదలు అతనికి భారత్‌లో వ్యతిరేకత మొదలయ్యింది. ఖలిస్తానీ భావజాలానికి మద్దతు ఇస్తున్నాడనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 

హర్జీత్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో భారత్‌పై ఆరోపణలు చేయడంతో ముంబైలో జరగాల్సిన శుభ్ సంగీత కచేరీ రద్దయ్యింది. శుభ్‌నీత్ అలియాస్ శుభ్‌ను ఫాలో చేసే వారిలో టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ కూడా ఉన్నారు. అయితే శుభ్‌.. ఖలిస్తాన్ భావజాలానికి మద్దతు ఇస్తున్నాడనే ఆరోపణలు వస్తుండటంతో తాజాగా విరాట్.. శుభ్‌ను అన్‌ఫాలో చేశాడు. సోషల్ మీడియాలో షేర్‌ చేసిన ఒక పోస్ట్‌లో శుభ్.. భారతదేశ మ్యాప్ నుండి పంజాబ్, జమ్మూ, కాశ్మీర్‌లను విడిగా చూపించాడు.

ఇది తీవ్ర వివాదాస్పదం కావడంతో శుభ్ దీనిపై క్లారిటీ ఇచ్చాడు. అతను ఒక పోస్ట్‌లో.. ‘భారతదేశంలోని పంజాబ్‌కు చెందిన యువగాయకునిగా, నేను ఆలపించే సంగీతాన్ని అంతర్జాతీయ వేదికపై ప్రదర్శించాలనేది నా కల. అయితే ఇటీవల చోటుచేసుకున్న సంఘటనలు నన్ను ఇబ్బందుల్లోకి నెట్టివేశాయి. అందుకే నా నిరుత్సాహాన్ని, బాధను వ్యక్తపరచడానికి కొన్ని మాటలు చెప్పాలనుకున్నాను. భారత పర్యటన రద్దుతో నేను తీవ్ర నిరాశకు గురయ్యాను. భారతదేశం నా దేశం. నేను ఇక్కడే పుట్టాను. ఇది నా గురువుల, పూర్వీకుల భూమి. పంజాబ్ నా ఆత్మ, పంజాబ్ నా రక్తంలో ఉంది. నేను  పంజాబీ కావడం వల్లనే ఈ స్థాయిలో ఉన్నాను. పంజాబీలు తమ దేశభక్తికి రుజువులు చూపాల్సిన అవసరం లేదు’ అంటూ తనలోని ఆవేదనను ఈ పోస్ట్ ద్వారా తగ్గించుకునే ప్రయత్నం చేశాడు శుభ్. 
ఇది కూడా చదవండి: గురుపత్వంత్ సింగ్ పన్నూ ఎవరు? భారత్‌- కెనడాల మధ్య ఎలా చిచ్చుపెడుతున్నాడు?

Advertisement

What’s your opinion

Advertisement