‘ప్రభుత్వం తప్పు చేస్తే శిక్ష మేం భరించాలా’, రోడ్డెక్కిన మాజీ ఉపాధ్యాయులు | West Bengal teachers protest in Kolkata after Supreme Court verdict | Sakshi
Sakshi News home page

‘ప్రభుత్వం తప్పు చేస్తే శిక్ష మేం భరించాలా’, రోడ్డెక్కిన మాజీ ఉపాధ్యాయులు

Apr 11 2025 7:50 AM | Updated on Apr 11 2025 8:00 AM

West Bengal teachers protest in Kolkata after Supreme Court verdict

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం 2016 నిర్వహించిన పశ్చిమబెంగాల్‌ స్కూల్‌ సర్వీస్‌ కమీషన్‌ (ssc)లో అవకతవకలు జరిగాయంటూ సుమారు 26 వేల మంది టీచర్ల నియామకాల్ని సుప్రీం కోర్టు రద్దు చేసింది. అయితే ఈ అంశంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. అత్యున్నత న్యాయస్థానం రద్దు చేసిన 26వేలమంది టీచర్లలో సుమారు 500 మంది రోడ్డెక్కారు.

తమ ఉద్యోగాలు తమకు ఇవ్వాల్సిందేనంటూ పశ్చిమబెంగాల్‌ సీల్దా, సెంట్రల్ అవెన్యూ  ప్రాంతాల్లో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా జోగ్యో శిక్షక్ మంచ్ (అర్హత గల ఉపాధ్యాయుల ఫోరం) ప్రతినిధి మెహబూబ్ మండల్ మాట్లాడుతూ.. ‘పరీక్షలో మంచి స్కోరు సాధించినా, నియామకాల్లో జరిగిన అవినీతి వల్ల మేం అర్హులమే అయినప్పటికీ ఉద్యోగాలు పోయాయి ఇది మా తప్పా?' అని ఆవేదన వ్యక్తం చేశారు.

 

అయితే, మా ఉద్యోగం మాకు తిరిగి ఇవ్వండి. లేదంటే అర్హులు, అవినీతి పరుల్ని గుర్తించాలని కోరుతూ చేసిన ఈ ధర్నాలో బాధితులపై పోలీసులు లాఠీ ఛార్జీ చేశారు. పలువురిపై దాడి చేశారన్న ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. పోలీసుల దాడి,లాఠీఛార్జీపై ఆందోళన కారులు మాట్లాడుతూ. ప్రజాస్వామ్యంలో మేము శాంతియుతంగా నిరసన తెలపలేకపోతే, న్యాయం కోసం మేము ఎవరి దగ్గరకు వెళ్లాలి? అని ప్రశ్నించారు.  

అవినీతికి శిక్ష, న్యాయానికి గౌరవం దక్కాలన్నదే మా డిమాండ్‌. త్వరలో మరింత మంది అర్హులైన ఉపాధ్యాయులతో సంప్రదింపులు జరపనున్నాం. ఆ తర్వాత భవిష్యత్‌ కార్యచరణ ప్రకటిస్తామని తెలిపారు.

టీచర్ల నియామకం రద్దు.. తీర్పు వెలువరించిన సుప్రీం 
అంతకుముందు పశ్చిమబెంగాల్‌ టీచర్‌ స్కాంపై సుప్రీం కోర్టు ఏప్రిల్‌ 3న విచారణ చేపట్టింది. అనంతరం తుదితీర్పును వెలువరించింది. పశ్చిమ బెంగాల్‌లో 2016 నుంచి పనిచేస్తున్న 25 వేల మంది ఉపాధ్యాయులు, సిబ్బంది నియామకాలను సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఈ మేరకు 2024లో కోల్‌కతా హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. నియామకాల్లో భారీ అక్రమాలు, అవకతవకలకు పాల్పడిన పశ్చిమబెంగాల్‌ స్కూల్‌ సర్వీస్‌ కమిషన్‌ (డబ్ల్యూబీఎస్‌ఎస్‌సీ)కు అత్యున్నత న్యాయస్థానం తలంటింది.

మొత్తం 25,753 మంది ఉపాధ్యాయులు, సిబ్బంది నియామకాల్లో అవకతవకలను, లోపాలను ఉద్దేశపూర్వకంగానే కప్పిపుచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ..మొత్తం నియామకాలు చెల్లవని తీర్పు వెలువరించింది. మళ్లీ నియామకాలు చేపట్టాలని మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ సంజయ్‌ కుమార్‌ల ధర్మాసనం గురువారం ఆదేశించింది. 

విద్యాశాఖ మంత్రితో సహా పలువురి అరెస్ట్‌
2016లో పశ్చిమబెంగాల్‌ స్కూల్‌ సర్వీస్‌ కమిషన్‌(డబ్ల్యూబీఎస్‌ఎస్‌సీ)నియామక ప్రక్రియలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలతో కేంద్ర దర్యాప్తు సంస్థలైన సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్,ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌లు రంగంలోకి దిగాయి. దర్యాప్తు చేపట్టి   పశ్చిమ బెంగాల్ మాజీ విద్యా శాఖ మంత్రి పార్థ ఛటర్జీ , రాష్ట్రస్కూల్‌ సర్వీస్‌ కమిషన్‌  పదవులు నిర్వహించిన మరికొందరు అధికారులను అరెస్ట్‌ చేశాయి. 

Advertisement
 
Advertisement
Advertisement