వన్నియార్లకు రిజర్వేషన్లు కుదరదన్న సుప్రీం | Vanniyar Quota Reservations 10. 5percent Cancelled By Supreme Court | Sakshi
Sakshi News home page

వన్నియార్లకు రిజర్వేషన్లు కుదరదన్న సుప్రీం

Apr 1 2022 5:20 AM | Updated on Apr 1 2022 8:09 AM

Vanniyar Quota Reservations 10. 5percent Cancelled By Supreme Court - Sakshi

న్యూఢిల్లీ: వన్నియార్లను (వన్నియకుల క్షత్రియులు) ప్రత్యేకంగా గుర్తించేందుకు గణనీయమైన ప్రమాణాలు లేవని గురువారం సుప్రీంకోర్టు వెల్లడించింది. అందువల్ల వీరికి ఎంబీసీల్లో కేటాయించిన 10.5 శాతం రిజర్వేషన్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. వీరికి రిజర్వేషన్‌ ఇవ్వాలన్న సిఫార్సుకు కేవలం జనాభాను మాత్రమే ప్రాతిపదికన తీసుకున్నారని జస్టిస్‌ ఎల్‌ నాగేశ్వరరావు, జస్టిస్‌ బీఆర్‌ గవైతో కూడిన ధర్మాసనం పేర్కొంది. ఎంబీసీల్లోని 115 కులాల్లో వీరిని ప్రత్యేకంగా చూసేందుకు కావాల్సిన ఆధారాల్లేవని తెలిపింది.

అందువల్ల వీరికి రిజర్వేషన్లు కల్పిస్తూ 2021లో చేసిన చట్టం ఆర్టికిల్‌ 14, 15, 16కు వ్యతిరేకమని, రిజర్వేషన్ల రద్దుపై హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సమర్ధిస్తున్నామని తెలిపింది. అంతర్గత రిజర్వేషన్లకు కులం ఒక కారణం కావచ్చు కానీ అదొక్కటే కారణం కాకూడదని తెలిపింది. ఎంబీసీ, డీఎన్‌సీలకు కేటాయించిన 20 శాతం రిజర్వేషన్లలో అంతర్గతంగా వన్నియార్లకు 10.5 శాతం రిజర్వేషన్‌ కేటాయించడం ఇతర వర్గాలను దెబ్బతీస్తుంద న్నది. ఈ విషయాన్ని విస్తృత ధర్మాసనానికి నివేదించాలన్న అభ్యర్ధనను కూడా కోర్టు తిరస్కరించింది. ఇప్పటికే ఈ కోటా కింద జరిపిన నియామకాలపై తాజా తీర్పు ప్రభావం ఉండదని తెలిపింది. వన్నియార్లకు ప్రత్యేక రిజర్వేషన్‌ రా జ్యాంగ విరుద్ధమని తమిళనాడుహైకోర్టు గతేడాది తీర్పునిచ్చింది.

Advertisement
 
Advertisement
Advertisement