
శ్రీనగర్: జమ్ముకశ్మీర్లోని రాజౌరి జిల్లాలో ఈరోజు (మంగళవారం) తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మహిళలు ప్రాణాలు కోల్పోగా, మరో తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు. చట్ట్యారి-చింగస్ సమీపంలో ఉదయం 5 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. రాజౌరి పట్టణం నుండి జమ్ముకు వెళ్తున్న టెంపో ట్రావెలర్ ఒక మినీ గూడ్స్ను ఢీకొంది. ఈ ప్రమాదంలో టెంపో తునాతునకలైందని పోలీసులు తెలిపారు.
మృతులను ఖోత్రా నివాసి ఇన్షా ఫాతిమా (26), ఫతేపూర్కు చెందిన ఫర్జాండ్ బేగం (50)గా గుర్తించారు. వీరిద్దరూ ఘటనాస్థలంలోనే మృతిచెందారు. గాయపడిన వారిలో మృతురాలు ఫర్జాండ్ బేగం భర్త మహ్మద్ ఇక్బాల్, వారి కుమార్తె రఫియా ఇక్బాల్ ఉన్నారు. క్షతగాత్రులను చికిత్స కోసం ఆస్పత్రులకు తరలించారు. వీరిలో ఏడుగురిని రాజౌరిలోని ప్రభుత్వ వైద్య కళాశాలకు తరలించగా, ఇద్దరికి స్థానికంగా చికిత్స అందిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాదానికి గల కారణాన్ని తెలుసుకునేందుకు దర్యాప్తు ముమ్మరం చేశారు.
ఇది కూడా చదవండి: మూడో ప్రపంచ యుద్ధం వస్తే.. ఈ దేశాలు సేఫ్!