Tamil Nadu: కోవిడ్ నుంచి రక్షణ కోసం ‘కరోనా దేవి’ యాగం

చెన్నై: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తోంది. కరోనా వైరస్ తగ్గాలని చెట్లకు వివాహం చేయటం, గ్రామ దేవతలను పూజించడం వంటి వార్తలు విన్నాం. అయితే తాజాగా కరోనా దేవిని ప్రతిష్టించి 48రోజులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించాలని తమిళనాడులోని కోయంబత్తూరు ‘కామచ్చిపురి అధినం’ అధికారులు నిర్ణయించారు. కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉండటంతో.. ‘కరోనా దేవి’ అనే దేవతను ప్రతిష్టించి యాగం నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. అయితే ఆ సమయంలో ప్రజలు ప్రార్థనలు చేయడానికి, ఆలయాన్ని సందర్శించడానికి అనుమతి ఉండదని తెలిపారు.
ప్రాణాంతక వ్యాధుల నుంచి ప్రజలను రక్షించడానికి దేవతలను ప్రతిష్టించడం గతంలో ఆచరణలో ఉందని తెలిపారు. దీనికి కోయంబత్తూరులో ప్లేగు మరియమ్మన్ ఆలయం ఓ ఉదాహరణ. గతంలో ప్లేగు, కలరా వ్యాపించినపుడు ఈ దేవతలు ప్రజలను రక్షించారని అక్కడి వారి నమ్మకమని కామచ్చిపురి అధినం మేనేజర్ ఆనంద్ భారతి అన్నారు.
కాగా తమిళనాడు ప్రభుత్వం కరోనా వైరస్ కట్టడికి గతవారం లాక్డౌన్ విధించిన సంగతి తెలిసిందే. లాక్డౌన్ నిబంధనల ప్రకారం.. కిరాణా, కూరగాయలు, మాంసం, చేపలు విక్రయించే దుకాణాలను ఉదయం 6 నుంచి 10 గంటలకు వరకు మాత్రమే తెరివడానికి అనుమతిస్తున్నారు. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 2,67,334 కొత్త కరోనా కేసులను నమోదయ్యాయి. దీంతో పాజిటివ్ కేసుల సంఖ్య 32,26,719కి చేరుకుంది.
(చదవండి: బ్లాక్ ఫంగస్: అంటువ్యాధిగా ప్రకటించిన రాజస్థాన్)