అనంతపురం రైల్వేస్టేషన్లో ఏజెంట్ ఒకరు ప్రమాదానికి గురవడంపై ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ స్పందించింది. రైలు ప్రయాణీకుడు ఒకరి ఫుడ్ ఆర్డర్ డెలివరీ కోసం ఓ ఏజెంట్ అనంతపురం రైల్వే స్టేషన్కు వెళ్లినప్పుడు.. కదులుతున్న రైల్లోంచి దిగేందుకు చేసిన ప్రయత్నంలో కిందపడిపోయాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో స్విగ్గీ స్పందించింది.
ఏజెంట్ల భద్రతకు తాము పూర్తి ప్రాధాన్యత ఇస్తామని స్పష్టం చేసింది. రైల్లోంచి కింద పడ్డ ఏజెంట్ ప్రస్తుతం సురక్షితంగానే ఉన్నట్లు తెలిపింది. అయితే స్విగ్గీ నిబంధనల ప్రకారం కదిలే రైళ్లను ఎక్కడం లేదా దిగడంపై ఇప్పటికే నిషేధం విధించామని తెలిపింది. ‘‘ఆ ఘటనను మేమూ పరిశీలించాం. హాని కలిగించే విషయాల నుంచి దూరంగా ఉండేందుకు మేము భద్రతపై ఇచ్చే శిక్షణను మరింత బలోపేతం చేశాం. ఇది చాలా తీవ్రమైన భద్రత సమస్య. రైలు డోర్/ప్లాట్ఫారమ్ నుంచి ఆహారాన్ని డెలివరీ చేయమని కస్టమర్లకు స్పష్టంగా తెలియజేయాలి. ప్రోటోకాల్ పాటించి ప్రమాదాలకు దూరంగా ఉండాలి’’ అని ఏజెంట్లను కోరింది.
ఏం జరిగిందంటే..
ఈ నెల ఆరో తేదీన రాత్రి ఏపీలోని అనంతపురం రైల్వేస్టేషన్లో ఏసీ కోచ్ లోని ఒక ప్రయాణికుడు ఆర్డర్ చేసిన ఫుడ్ డెలివరీ ఇవ్వడానికి స్విగ్గీ ఏజెంట్ రైలెక్కాడు. ఇంతలో రైలు కదలడంతో.. కంగారులో రన్నింగ్ ట్రైన్ నుంచి ప్లాట్ ఫామ్ పైకి దిగబోయాడు. ట్రైన్ వేగం ఎక్కువగా ఉండడంతో డెలివరీ బాయ్ ప్లాట్ ఫామ్ పై పడిపోయాడు. ప్రశాంతి ఎక్స్ప్రెస్ లో జరిగిన ఈ ఘటనను బిజయ్ ఆనంద్ అనే వ్యక్తి ఇన్స్టాగ్రామ్లో పోస్టు చేశాడు.
“హాల్ట్ కేవలం 1-2 నిమిషాల మాత్రమే. ప్రయాణికుడు 1ACలో ఉన్నాడు. ఫుడ్ అందించే సమయానికి రైలు స్టార్ట్ అయింది. డెలివరీ బాయ్.. ఇంకా డెలివరీ చేయడానికి ఇతర ఆర్డర్లు ఉండడం, అతని బైక్, ఫుడ్ బ్యాగ్ స్టేషన్ బయట ఉండిపోవడంతో.. కదులుతున్న రైలు దిగాల్సిన పరిస్థితి. జీవనోపాధి కోసం డెలివరీ ఏజెంట్ తన ప్రాణాలను ప్రమాదంలో పడేసుకున్నాడు” అని బిజయ్ ఆనంద్ కామెంట్ చేశారు.
At #Anantapur station, a #Swiggy delivery boy went to deliver food to a train. The train stopped for just 1-2 minutes and then started moving. His bike and bag were outside, and he had more orders to deliver.
So, he panicked and tried to get off the moving train,
1/3 pic.twitter.com/5R8xqnQa90— Siraj Noorani (@sirajnoorani) January 9, 2026
నెటిజన్ల విమర్శలు..
సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వీడియోపై ఇప్పుడు చాలామంది స్పందిస్తున్నారు. ఫుడ్ డెలివరీల వేగం పెంచాలని ప్లాట్ఫామ్స్ వర్కర్లను ఒత్తిడి చేయడం సరికాదని ఓ వ్యక్తి వ్యాఖ్యానించారు. ఇంకో వ్యక్తి మాట్లాడుతూ 10 నిమిషాల డెలివరీ టార్గెట్ను తొలగించాలని డిమాండ్ చేశారు. మరోకరు స్పందిస్తూ.. ప్రయాణికుడు పార్శిల్ను స్వీకరించడానికి కనీసం రైలు డోర్ వద్దకు వచ్చి ఉండాలని అభిప్రాయపడ్డారు. చాలీచాలని జీతాలతో పనిచేస్తున్న గిగ్ వర్కర్లు ఈ మధ్యకాలంలో తమ కష్టాలపై గళమెత్తుతున్న విషయం తెలిసిందే. గతనెల చివరిలో కొన్ని రాష్ట్రాల గిగ్వర్కర్లు సామూహిక సమ్మెకు కూడా దిగారు. కొన్ని రాష్ట్రాల్లో గిగ్ వర్కర్లకు బీమా వంటి సౌకర్యాలు కల్పిస్తూండగా.. మిగిలిన చోట్ల వారి కష్టానికి తగ్గ ఫలితం దక్కడం లేదన్న విమర్శలు ఉన్నాయి.


