స్వదేశానికి రండి | Supreme Court orders Prabhakar Rao | Sakshi
Sakshi News home page

స్వదేశానికి రండి

May 30 2025 1:34 AM | Updated on May 30 2025 1:34 AM

Supreme Court orders Prabhakar Rao

ప్రభాకర్‌రావుకు సుప్రీంకోర్టు ఆదేశం 

భారత్‌కు వచ్చిన 3 రోజుల్లోగా విచారణకు హాజరవ్వాలని వెల్లడి 

ఎస్‌ఐబీ మాజీ చీఫ్‌ పాస్‌పోర్టు పునరుద్ధరించాలని సిట్‌కు సూచన 

తదుపరి విచారణ వరకు ఆయన్ను అరెస్టు చేయొద్దన్న ధర్మాసనం 

ఆయనను పారిపోయిన వ్యక్తిగా పరిగణించలేమని స్పష్టీకరణ 

ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై తదుపరి విచారణ ఆగస్టు 5కు వాయిదా 

సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో గత ప్రభుత్వ హయాంలో రాజకీయ నాయకులు, హైకోర్టు న్యాయమూర్తుల ఫోన్‌ ట్యాపింగ్‌కు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్యూరో మాజీ చీఫ్‌ టి.ప్రభాకర్‌రావును భారతదేశానికి తిరిగి రావాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. తదుపరి ఉత్తర్వు లు వచ్చే వరకు ప్రభాకర్‌రావుపై ఎటువంటి బలవంతపు చర్యలు తీసుకోకూడదని దర్యాప్తు బృందానికి సూచించింది. పాస్‌పోర్టు రద్దు కా రణంగా ప్రభాకర్‌రావు స్వదేశానికి తిరిగి రా లేని పరిస్థితుల్లో ఆయనను పారిపోయిన వ్యక్తి గా పరిగణించలేరని స్పష్టం చేసింది. 

పాస్‌ పోర్టు లేదా ప్రయాణ పత్రం అందిన 3 రోజు ల్లోపు దేశానికి తిరిగి వస్తాననే హామీ పత్రం ఇవ్వాలని ప్రభాకర్‌రావుకు సూచించింది. ఈ ఆదేశాలను అడ్వాంటేజ్‌గా తీసుకోవద్దని తెలిపింది. తదుపరి విచారణను ఆగస్టు 5కు వాయిదా వేసింది. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో ముందస్తు బెయిల్‌ ఇవ్వాలని కోరుతూ ప్రభాకర్‌రావు దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్‌ బీవీ నాగరత్న, జస్టిస్‌ సతీష్‌ చంద్ర శర్మలతో కూడిన దర్మాసనం గురువారం విచారణ జరిపింది. ఆయన తరఫున సీనియర్‌ న్యాయవాది దామా శేషాద్రినాయుడు వాదించారు. 

పాస్‌పోర్టు పునరుద్ధరిస్తే వస్తారు 
ముప్పై సంవత్సరాల పాటు ప్రభుత్వ అధికారిగా సేవలందించిన ప్రభాకర్‌రావుపై తప్పు డు కేసులు పెట్టారని శేషాద్రినాయుడు చెప్పా రు. ఎఫ్‌ఐఆర్‌ సమయంలో ఆయన అమెరికా వెళ్లారని, దీంతో ఆయన్ను పరారీలో ఉన్న నిందితుడిగా ప్రకటించి పాస్‌పోర్టును రద్దు చేశారని తెలిపారు. ఆయన అమెరికా నుంచి తిరిగి వచ్చేందుకు అవకాశం లేకుండా పాస్‌పోర్టును రద్దు చేశారని తెలిపారు. పాస్‌పోర్టు పునరుద్ధరిస్తే భారత్‌కు తిరిగి వస్తారని, విచారణకు సహకరిస్తారని హామీ ఇచ్చారు. ఈ కేసులో ఇప్పటికే పలువురికి బెయిల్‌ ఇచ్చారన్నారు.   

మధ్యంతర రక్షణ ఇవ్వొద్దు : తెలంగాణ ప్రభుత్వం తరఫున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా వాదనలు వినిపిస్తూ.. ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహా రం చాలా తీవ్రమైనదని, ప్రభాకర్‌రావుకు ఎటువంటి మధ్యంతర రక్షణ ఇవ్వరాదని అన్నారు. ఆయన పరారీలో ఉన్నందున ముందస్తు బెయిల్‌ను రాష్ట్ర ప్రభు త్వం వ్యతిరేకిస్తోందని చెప్పారు. ప్రభాకర్‌రావు పరారీలో ఉన్నట్లుగా ప్రకటి స్తూ న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసిందని తెలి పారు.

ముందస్తు బెయిల్‌ కాకుండా రెగ్యులర్‌ బెయిల్‌ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని సూచించగా.. పిటిషనర్‌ తిరిగి వస్తే ఆయనను అరెస్టు చేయబోమని ప్రకటన చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందా అని జస్టిస్‌ నాగరత్న ప్రశ్నించా రు. లేదని, ప్రభాకర్‌రావును అరెస్టు చేయాలని అనుకుంటున్నట్లు తుషార్‌ మెహతా చెప్పారు. కేసు దర్యాప్తు అధికారి తరఫున హాజరైన సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా కూడా ప్రభాకర్‌రావుకు ముందస్తు బెయిల్‌ను వ్యతిరేకించారు. ఈ నేపథ్యంలో జస్టిస్‌ నాగరత్న జోక్యం చేసుకున్నారు. 

‘ఆయన భారత్‌కు తిరిగి రాలేని పరిస్థితుల్లో ప్రభాకర్‌రావు చట్టానికి దూరంగా ఉన్నట్టు మీరు చెప్పలేరు. ఆయన పారిపోయిన వ్యక్తి కాదు’అని అన్నారు. వాదనల అనంతరం ప్రభాకర్‌రావు స్వదేశానికి తిరిగి వచ్చేందుకు వీలుగా ఆయన పాస్‌ పోర్టును పునరుద్ధరించాలని ధర్మాసనం ఆదేశించింది. తదుపరి విచారణ వరకు ఆయనను అరెస్టు చేయరాదని ప్రత్యేక దర్యాప్తు బృందానికి తెలిపింది. దేశానికి వచ్చిన మూడు రోజుల వ్యవధిలోనే దర్యాప్తు అధికారి ముందు హాజరు కావాలని ప్రభాకర్‌రావుకు స్పష్టం చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement