
న్యూఢిల్లీ: అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో గురువారం కొత్తగా ముగ్గురు న్యాయమూర్తులు నియమితులయ్యారు. సుప్రీం కొలీజియం సోమవారం సిఫారసు చేసిన కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ఎన్వీ అంజరియా, గౌహతి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ విజయ్ బిష్ణోయ్, బాంబే హైకోర్టు జస్టిస్ ఏఎస్ చందూర్కర్ వీరిలో ఉన్నారు. ఈ విషయాన్ని న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మెఘ్వాల్ గురువారం ‘ఎక్స్’లో ప్రకటించారు.
భారత రాజ్యాంగాన్ని అనుసరించి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో సంప్రదించిన మీదట ఈ నియామకాలు చేపట్టారని ఆయన పేర్కొన్నారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ హృషికేశ్ రాయ్లు ఇటీవల పదవీ విరమణ చేయడంతో ఈ నియామకాలు జరిగినట్లు మంత్రి వివరించారు. తాజాగా నియమితులైన ముగ్గురు జడ్జీలు ప్రమాణం శుక్రవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీంతో, సుప్రీంకోర్టులో మంజూరైన మొత్తం 34 మందీ ఉన్నట్లు లెక్క. అయితే, ఇది స్వల్ప కాలం మాత్రమే. జూన్ 9వ తేదీన జస్టిస్ బేలా ఎం త్రివేదీ పదవీ విరమణ చేయనుండటమే ఇందుకు కారణం.