ఇక నుంచి యూకే–భారత్‌ మధ్య స్పైస్‌జెట్‌ సర్వీసులు!

Spice Jet Services Start Between UK and India - Sakshi

సాక్షి, హైదరాబాద్: బడ్జెట్‌ క్యారియర్‌ స్పైస్‌జెట్‌  యూకే–భారత్‌ మధ్య విమాన సర్వీసులను నడుపనుంది. సెప్టెంబర్‌ 1 నుంచి ఈ సేవలు ప్రారంభం కానున్నాయి. లండన్‌ హీత్రో ఎయిర్‌పోర్ట్‌ నుంచి ఈ మేరకు స్లాట్స్‌ దక్కించుకున్నట్టు క్యారియర్‌ స్పైస్‌జెట్‌ కంపెనీ ప్రకటించింది. ఎయిర్‌ బబుల్‌ ఒప్పందంలో భాగంగా అక్టోబరు 23 వరకు ఈ స్లాట్స్‌ పొందామని, అంతర్జాతీయ సర్వీసులు తిరిగి ప్రారంభం అవగానే సాధారణ విమాన సేవలను తిరిగి మొదలుపెడతామని వెల్లడించింది. ఎయిర్‌ బబుల్‌ ఒప్పందం ప్రకారం నిబంధనలు, పరిమితులతో రెండు దేశాలకు చెందిన విమానయాన సంస్థలు అంతర్జాతీయ సర్వీసులను నడపవచ్చు. శీతాకాలంలో సాధారణ విమాన సేవలను అందించేందుకు స్లాట్స్‌ కోసం చర్చలు జరుపుతున్నట్లు కంపెనీ తెలిపింది. తాజా పరిణామాలపై స్పైస్‌జెట్‌ సీఎండీ అజయ్‌ సింగ్‌ మాట్లాడుతూ కంపెనీకి ఇది పెద్ద మైలురాయిగా అభివర్ణించారు. ఇదిలావుండగా కోవిడ్‌–19 నేపథ్యంలో అంతర్జాతీయ విమాన సర్వీసులను మార్చి 22 నుంచి భారత్‌ నిలిపివేసిన సంగతి తెలిసిందే. లాక్‌డౌన్‌ కారణంగా ఇతర దేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను వెనక్కి తీసుకురావడానికి, అలాగే ఇక్కడి నుంచి విదేశీయులను వారి స్వస్థలాలకు చేర్చేందుకు ప్రత్యేక విమానాలను మాత్రమే నడుపుతున్నారు.

చదవండి: ఆఫర్‌ టికెట్ల అమ్మకాలు ఆపండి

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top