Rahul Gandhi Can Get Ordinary Passport Delhi Rouse Avenue Court - Sakshi
Sakshi News home page

రెగ్యులర్‌ పాస్‌పోర్టు కోసం రాహుల్‌ గాంధీ.. లైన్‌ క్లియర్‌

May 26 2023 1:55 PM | Updated on May 26 2023 2:59 PM

Rahul Gandhi Can Get Ordinary Passport Delhi rouse avenue court - Sakshi

రాహుల్‌ గాంధీ కోరినట్లు పదేళ్లు కాకుండా.. మూడేళ్లు మాత్రమే.. 

సాక్షి, ఢిల్లీ: పాస్‌పోర్టు వ్యవహారంలో.. కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీకి ఢిల్లీ కోర్టు ఊరట ఇచ్చింది. మూడు సంవత్సరాలపాటు సాధారణ(రెగ్యులర్‌) పాస్‌పోర్ట్‌ పొందేందుకు అనుమతిస్తూ శుక్రవారం ఎన్‌వోసీ ఆదేశాలు జారీ చేసింది.

ఎంపీగా పార్లమెంట్‌ అనర్హత వేటు ఎదుర్కొన్న రాహుల్‌ గాంధీ..  తన డిప్టోమేటిక్‌ పాస్‌పోర్ట్‌ను తిరిగి అప్పగించారు. పాస్‌పోర్టుతో పాటు అన్ని రకాల ప్రయాణ పత్రాలను సంబంధిత అధికారులకు అందజేశారు. అనంతరం కొత్త పాస్‌పోర్టు(సాధారణ) దరఖాస్తు చేసుకునేందుకు నో అబ్జక్షన్‌ సర్టిఫికేట్‌(NOC) కోసం రౌస్‌ అవెన్యూ కోర్టును ఆశ్రయించారాయన. అందుకు కారణం..

నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో ఆయన నిందితుడిగా ఉండడమే. బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి దాఖలు చేసిన మనీలాండరింగ్‌, నిధుల దుర్వినియోగానికి సంబంధించిన కేసు ఇది. దీంతో రెగ్యులర్‌ పాస్‌పోర్టు కోసం ఆయన ఎన్‌వోసీ తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఈ క్రమంలో ఇవాళ కోర్టు ఆదేశాలిస్తూ అయితే రాహుల్‌ కోరినట్లు పదేళ్లకు కాకుండా మూడేళ్లకు మాత్రమే సాధారణ పాస్‌పోర్ట్‌ కోసం ఎన్‌వోసీ ఇస్తున్నట్లు తెలిపింది. 

అంతకు ముందు బుధవారం విచారణ సందర్భంగా.. పాస్‌పోర్టు నో-అబ్జెక్షన్ సర్టిఫికేట్ కోరుతూ గాంధీ చేసిన అభ్యర్థనపై శుక్రవారంలోగా సమాధానం ఇవ్వాలని బీజేపీ మాజీ ఎంపి స్వామిని కోర్టు కోరింది. ఇక ఇవాళ్టి తీర్పు సందర్భంగా..  అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ వైభవ్ మెహతా ప్రయాణించే హక్కు ప్రాథమిక హక్కు అని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ప్రయాణాలపై కోర్టు ఆంక్షలు విధించలేదని తెలిపింది.

అలాగే.. 2015 డిసెంబరులో రాహుల్‌ గాంధీకి బెయిల్ మంజూరు చేస్తున్నప్పుడు, కోర్టు అతని ప్రయాణంపై ఎటువంటి ఆంక్షలు విధించలేదని, ఆంక్షలు విధించాలంటూ స్వామి చేసిన విజ్ఞప్తిని ఆ సమయంలోనూ తిరస్కరించారని మేజిస్ట్రేట్ ఈ సందర్భంగా గుర్తు చేశారు కూడా.

Advertisement
 
Advertisement
Advertisement