
పదేళ్లలో చైనా నుంచి రెట్టింపైన దిగుమతులు
నినాదాలు ఇవ్వడంలో మోదీ హిట్
పరిష్కారాలు చూపడంలో ఫట్
రాహుల్ గాంధీ ధ్వజం
సాక్షి, న్యూఢిల్లీ: భారత్లో చేపట్టిన ‘మేక్ ఇన్ ఇండియా’తో మన దేశానికి ఎలాంటి లాభం లేకపోగా చైనాయే ఎక్కువగా లాభపడిందని కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభలో విపక్ష నేత రాహుల్గాంధీ తీవ్రంగా విమర్శించారు. 2014 తర్వాత భారత్లో తయారీ రంగం జీడీపీలో 14 శాతానికి పడిపోవడం, చైనా నుంచి దిగుమతులు రెట్టింపు కావడాన్ని ఆయన ప్రస్తావించారు. ప్రధాని మోదీ నినాదాలు ఇవ్వడంలో మాస్టర్ అని.. పరిష్కారాలు చూపడంలో కాదని రాహుల్ ఎద్దేవా చేశారు.
శనివారం రాహుల్ తన సామాజిక మాధ్యమ ‘ఎక్స్’ఖాతాలో ఒక పోస్ట్పెట్టారు. ‘మేక్ ఇన్ ఇండియా పరిశ్రమల బూమ్కి మోదీ సర్కార్ హామీ ఇచి్చంది. అయితే తయారీరంగం ఎందుకు చరిత్రలో కనీవినీ ఎరుగని స్థాయికి దిగజారింది? యువత అత్యధిక స్థాయిలో నిరుద్యోగాన్ని ఎదుర్కొంటోంది. చైనా నుంచి దిగుమతులు రెట్టింపయ్యాయి. నినాదాలు ఇచ్చే కళలో మోదీ విపరీతమైన నైపుణ్యం సాధించారు. కానీ పరిష్కారాలు చూపడంలో ఘోరంగా విఫలమయ్యారు’’అని రాహుల్ విమర్శించారు.
అంతా అసెంబ్లింగ్
ఢిల్లీలో ప్రముఖమైన ఎల్రక్టానిక్స్ విక్రయ దుకాణ సముదాయం అయిన నెహ్రూ ప్లేస్ను రాహుల్ సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడి మొబైల్ రిపేర్ టెక్నీషియన్స్ అయిన సైఫ్, శివమ్లతో కొద్దిసేపు మాట్లాడారు. సంబంధిత వీడియోనూ ‘ఎక్స్’లో రాహుల్ షేర్చేశారు. ‘‘‘నిజం ఏంటంటే.. ఇతర దేశాల నుంచి విడిభాగాలను దిగుమతి చేసుకుంటున్నాం. వాటికి బిగించే అసెంబ్లింగ్ పనిచేస్తున్నాం. అంతేగానీ ఇక్కడ ఉత్పత్తిచేయట్లేము. అందుకే మన కారణంగా చైనా లాభపడుతోంది.
చైనా ప్రపంచంలోనే అతిపెద్ద ఎల్రక్టానిక్ మార్కెట్గా వెలుగొందుతోంది. ఇంతపెద్ద మార్కెట్ మరేచోటా లేదు. మనం ఐఫోన్ విడిభాగాలను దిగుమతిచేసుకుని అసెంబ్లింగ్ చేస్తున్నాం. ఇది అతికొద్ది మంది పారిశ్రామికవేత్తల కనుసన్నల్లో జరుగుతోంది. ఇకపై మనమే ఐఫోన్లను తయారుచేసే స్థాయికి ఎదుగుదాం. అప్పుడే ఈ పరిశ్రమ పురోగతి సాధిస్తుంది. ఇతర దేశాల వస్తువులకు భారత్ అనేది మార్కెట్గా ఉండకూడదు.
స్థానికంగా ఉత్పత్తులను తయారుచేసి ఎగుమతి చేసే మార్కెట్గా భారత్ అవతరించాలి. ఇందుకోసం ప్రాథమికస్థాయిలోనే సంస్కరణలు రావాలి. లక్షల కొద్దీ తయారీదారులు తయారుకావాలి. ఇందుకు ఎంతో నిజాయతీతో కూడిన సంస్కరణలు, ఆర్థిక దన్ను అవసరం. ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం(పీఎల్ఐ) ప్రయోజనాలనూ ప్రభుత్వం గుట్టుచప్పుడుకాకుండా నెమ్మదిగా ఉపసంహరించుకుంటోంది. ఇది కూడా ప్రభుత్వ వైఫల్యమే’అని రాహుల్ గాంధీ మండిపడ్డారు.
విమర్శించిన బీజేపీ
రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ స్పందించింది. ‘‘దేశంలో భారీ సంస్కరణలు, దేశ పురోగతిని అందరూ కళ్లారా చూస్తున్నారు ఒక్క రాహుల్ తప్ప. దేశ ప్రగతిని తక్కువ అంచనా వేయంలో రాహుల్ బిజీగా మారారు. భారత స్వావలంభనకు ఆపరేషన్ సిందూర్ తాజా తార్కాణం. చైనా తయారీ డ్రోన్లను భారత తయారీ డ్రోన్లు నేలకూల్చాయి’’అని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారీ అన్నారు.