ప్రధాని మోదీ వ్యాఖ్య
న్యూఢిల్లీ: పట్టణ ప్రాంతాల్లో నీటి కొరత తీవ్రతరంకాకుండా జల సంరక్షణ సాంకేతికతలను మరింతగా అమల్లోకి తేవాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. జలంపై కేంద్ర జలశక్తి శాఖ నిర్వహించిన జాతీయస్థాయి రెండు రోజుల కార్యక్రమం ముగింపు వేడుకలో ప్రధాని మోదీ పాల్గొని ప్రసంగించారు. ‘‘పట్టణీకరణతో నగరాలు, పట్టణ ప్రాంతాల్లో జనాభా విపరీతంగా పెరిగిపోతోంది. వీళ్ల అవసరాలు తీర్చేలా పట్టణ పురపాలికలు నీటి సంరక్షణపై మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి.
ఈ మేరకు నీటి సంరక్షణ సాంకేతికతల అమలుపై బాగా దృష్టిసారించాలి. అంతర్జాతీయంగా అమల్లో ఉన్న అత్యుత్తమ నీటి సంరక్షణ విధానాలు,సాంకేతికతలను నగర, పట్టణ కార్పోరేషన్లలో అమలుచేయాలి. ఈ సాంకేతికతలు విస్తృతంగా అందుబాటులోకి వచ్చేలా, సంబంధిత ఉపకరణాలను స్థానికంగా తయారుచేసేలా భారతీయ పరిశ్రమలకు అవకాశాలను మెరుగుపరచాలి. జల సంరక్షణలో ప్రజా భాగస్వామ్యాన్నీ విపరీతంగా పెంచాలి.
పౌరుల్లో నీటిపై, నీటి వృథాను అరికట్టడంపై, నీటిని పొదుపుగా వాడుకోవడంపై మరింతగా అవగాహన పెంచేలా జల్ఉత్సవ్ వంటి కార్యక్రమాలను నిర్వహించాలి. పట్టణ ప్రాంతాల్లోని చెరువులు, కాలువలు, రిజర్వాయర్లలో చెత్త, వ్యర్థ్యాల పూడిక తీసే కార్యక్రమాలను ఎప్పటికప్పుడు చేపట్టాలి. భూగర్భ జలాలు పెరిగేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతుగా కృషిచేయాలి.
ఈ సదస్సును ఒకసారి చేపట్టేసి చేతులు దులుపుకోవడం కాకుండా ఇలాంటి కార్యక్రమాలు నిరంతరాయంగా జరగాలి. జల సంరక్షణ విజయవంతంగా చేపడుతున్న ప్రాంతాలను ఉన్నతాధికారులు, రైతులు, ప్రజాప్రతినిధులు రాష్ట్రాలకతీతంగా సందర్శించి అవగాహన పెంచుకోవాలి. జల వనరులను ఎలా సంరక్షించుకోవాలో, సది్వనియోగం చేయాలనే దాని కోసం జల గణాంకాలను కృత్రిమ మేథ సాయంతో మేళవించి మెరుగైన పరిష్కారాలను కనుగొనాలి’’అని మోదీ సూచించారు.


