వాణిజ్య బంధం బలోపేతంపైనే దృష్టి | PM Modi, US Vice President Vance discuss trade, strategic ties and global issues | Sakshi
Sakshi News home page

వాణిజ్య బంధం బలోపేతంపైనే దృష్టి

Apr 22 2025 5:14 AM | Updated on Apr 22 2025 5:14 AM

PM Modi, US Vice President Vance discuss trade, strategic ties and global issues

ద్వైపాక్షిక ఒప్పందంపై చర్చించిన ప్రధాని మోదీ, అమెరికా ఉపాధ్యక్షుడు వాన్స్‌

ఒప్పందం పురోగతిపై సంతృప్తి వ్యక్తంచేసిన ఇరు నేతలు 

తొలుత వాన్స్‌ కుటుంబానికి తన నివాసం వద్ద సాదరస్వాగతం పలికిన ప్రధాని

న్యూఢిల్లీ: అగ్రరాజ్యాధినేత ట్రంప్‌ ఆదేశాలతో అమెరికా ప్రభుత్వం భారత్‌పై సుంకాల సుత్తితో మోదుతున్న వేళ ట్రంప్‌కు కుడిభుజం, ఆ దేశ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. నాలుగు రోజుల పర్యటనలో భాగంగా హస్తనకు విచ్చేసిన వాన్స్‌ సోమవారం సాయంత్రం ప్రధాని మోదీని ఆయన నివాసంలో కలిశారు. సతీమణి ఉషా చిలుకూరి, పిల్లలు ఇవాన్, వివేక్, మీరాబెల్‌లతో కలిసి 7, లోక్‌కళ్యాణ్‌ మార్గ్‌లోని మోదీ అధికారిక నివాసానికి వాన్స్‌ విచ్చేశారు. అక్కడ వీళ్ల కుటుంబానికి మోదీ సాదర స్వాగతం పలికారు. స్వయంగా కారు దాకా వచ్చిన మోదీ.. వాన్స్‌ కారు దిగి దగ్గరకు రాగానే ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. 

వాన్స్‌ వెంట వచ్చిన కుమారులిద్దరినీ సరదాగా పలకరించారు. వారిని పరిచయం చేసుకున్నారు. కుమార్తె మీరాబెల్‌ను ఎత్తుకుని వచ్చిన ఉషా చిలుకూరితో మోదీ కరచాలనం చేసి కుశల ప్రశ్నలు వేశారు. తర్వాత చిన్నారులను చేయిపట్టుకుని ఇంట్లోకి తీసుకెళ్లారు. తొలుత వాన్స్‌ కుటుంసభ్యులందరికీ ఇంటి గార్డెన్‌ను మోదీ స్వయంగా చూపించారు. నెమళ్లు స్వేచ్ఛగా విహరిస్తున్న పచ్చికబయళ్లలో కుటుంబంతో కలిసి మోదీ కలియతిరిగారు. తర్వాత ఇంట్లోకి తీసుకెళ్లి గ్రూప్‌ ఫొటో దిగారు. తర్వాత నెమలి ఈకలను ముగ్గురు చిన్నారులకు ఇచ్చి వారితో ముచ్చటించారు. మీద కూర్చోబెట్టుకుని కబుర్లు చెప్పారు. వాన్స్‌ చిన్నకుమారుడు వివేక్‌ మోదీ తరహా డ్రెస్, పెద్దబ్బాయి ఇవాన్‌ సూట్‌ ధరించారు. 

ఒప్పందం పురోగతిపై  సంతృప్తి
తర్వాత మోదీ, వాన్స్‌లు విడిగా ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఇరుదేశాలకు ప్రయోజనకారి అయిన ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై విస్తృతస్థాయిలో చర్చలు జరిపారు. ఒప్పందం పురోగతిపై మోదీ, వాన్స్‌లు సంతృప్తి వ్యక్తంచేశారు. వీలైనంత త్వరగా ఒప్పందం ఓ కొలిక్కి వచ్చేలా చూడటంపై ప్రధానంగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. దీంతోపాటు రక్షణ, ఇంధనం, వ్యూహాత్మక సాంకేతికత రంగాల్లో మరింత సహకారంపైనా చర్చలు జరిపారు. త్వరలో భారత్‌లో పర్యటించాలని భావిస్తున్నందుకు ట్రంప్‌కు తన తరఫున కృతజ్ఞతలు తెలపాలని వాన్స్‌తో మోదీ చెప్పారు. 

ద్వైపాక్షిక సహకారానికి సంబంధించిన పలు అంశాల్లో పురోగతి సాధించంపై ఇరు దేశాల నేతలు సమగ్ర స్థాయిలో చర్చలు జరిపారని భేటీ ముగిశాక సోమవారం రాత్రి భారత్‌ ఒక ప్రకటన విడుదలచేసింది. ‘‘ ఫిబ్రవరిలో ట్రంప్‌తో భేటీ, ఫలవంతమైన చర్చల వివరాలను వాన్స్‌ వద్ద మోదీ ప్రత్యేకంగా ప్రస్తావించారు. నాటి చర్చలు ఇరు దేశాల మధ్య సహకారానికి బాటలు వేశాయి. అటు మేక్‌ అమెరికా గ్రేట్‌ ఎగేన్‌కు, ఇటు వికసిత్‌ భారత్‌ 2047 సుసాధ్యానికి మార్గం సుగమం చేశాయి. ఇరు దేశాల ప్రజల సంక్షేమానికి దోహదపడే దైపాక్షిక వాణిజ్యం ఒప్పందం(బీటీఏ) పురోగతిపై నేతలిద్దరూ సంతృప్తి వ్యక్తంచేశారు. 

టారిఫ్‌లు, ఇరుదేశాల మార్కెట్లలోకి సులభంగా ప్రవేశించడం తదితర కీలకాంశాలు బీటీఏలు ఉండనున్నాయి. పరస్పర ప్రయోజనకర అంశాలతోపాటు అంతర్జాతీయ సమకాలీన అంశాలూ మోదీ, వాన్స్‌ల భేటీలో ప్రస్తావనకు వచ్చాయి. సమస్యాత్మక అంతర్జాతీయ అంశాల్లో దౌత్యం, సంప్రతింపులే పరిష్కార మార్గాలని నేతలు భావించారు. భారత్‌లో ఉన్నన్ని రోజులు వాన్స్, ఉషా, వాళ్ల చిన్నారులు ఎంతో ఆహ్లాదంతో గడపాలని మోదీ ఆకాంక్షించారు’’ అని ఆ ప్రకటన పేర్కొంది. చర్చల్లో భారత్‌ తరఫున విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్, జాతయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్, ప్రధాని ముఖ్య కార్యదర్శి శక్తికాంతదాస్‌ పాల్గొన్నారు. 12 ఏళ్ల తర్వాత అమెరికా ఉపాధ్యక్షుడు ఒకరు భారత్‌లో పర్యటించడం ఇదే తొలిసారి. 2013లో నాటి ఉపాధ్యక్ష హోదాలో జోబైడెన్‌ ఢిల్లీకి వచ్చారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement