Rajnath Singh: ‘ఆపరేషన్‌ సిందూర్‌’ ఆగలేదు  | Operation Sindoor still ongoing says Rajnath Singh in at all party meet | Sakshi
Sakshi News home page

Rajnath Singh: ‘ఆపరేషన్‌ సిందూర్‌’ ఆగలేదు 

May 9 2025 3:16 AM | Updated on May 9 2025 3:16 AM

Operation Sindoor still ongoing says Rajnath Singh in at all party meet

100 మంది ముష్కరులు, వారి మద్దతుదారులు హతమయ్యారు  

పాకిస్తాన్‌ ఉగ్రవాదులపై సైనిక చర్య కొనసాగుతోంది  

అఖిలపక్ష సమావేశంలో రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ వెల్లడి 

కేంద్రానికి సంపూర్ణ మద్దతు ప్రకటించిన విపక్ష నేతలు  

న్యూఢిల్లీ: ఆపరేషన్‌ సిందూర్‌లో కనీసం 100 మంది కరడుగట్టిన పాకిస్తాన్‌ ఉగ్రవాదులు, వారి మద్దతుదారులు హతమయ్యారని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ స్పష్టంచేశారు. ఈ ఆపరేషన్‌ ఆగిపోలేదని, ఇంకా కొనసాగుతూనే ఉందని వెల్లడించారు. భారత్‌ ఘర్షణలు కోరుకోవడం లేదని, పాకిస్తాన్‌ దాడి చేస్తే మాత్రం గట్టిగా బుద్ధిచెప్పడం ఖాయమని అన్నారు. రెచ్చగొడితే ఎదురుదాడి చేయక తప్పదని తేల్చిచెప్పారు. 

రాజ్‌నాథ్‌ సింగ్‌ అధ్యక్షతన గురువారం ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం జరిగింది. కేంద్ర మంత్రులు అమిత్‌ షా, నిర్మలా సీతారామన్, ఎస్‌.జైశంకర్, బీజేపీ అధ్యక్షుడు జె.పి.నడ్డా, కాంగ్రెస్‌ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్‌ గాంధీ సహా వివిధ పార్టీల నాయకులు హాజరయ్యారు. పాకిస్తాన్‌పై భారత్‌ చేపట్టిన సైనిక చర్యకు పారీ్టలకు అతీతంగా వారంతా మద్దతు పలికారు. ఇది రాజకీయాలకు సమయం కాదని, మనమంతా ఐక్యంగా ఉండాలని నిర్ణయానికొచ్చారు. 

భారత సైనిక దళాల పరాక్రమాన్ని ప్రశంసించారు. అన్ని పారీ్టల నాయకులు ఏకగ్రీవంగా అభినందనలు తెలియజేశారు. పాకిస్తాన్‌తో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వానికి అండగా ఉంటామని చెప్పారు. ఆపరేషన్‌ సిందూర్‌ గురించి రాజ్‌నాథ్‌ సింగ్‌ వివరించారు. విపక్ష నేతలు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. ఈ ఆపరేషన్‌ ద్వారా ఇప్పటిదాకా అనుకున్న లక్ష్యాలు సాధించినట్లు తెలిపారు. ఆపరేషన్‌ కొనసాగుతూనే ఉంది కాబట్టి పూర్తి వివరాలు వెల్లడించడం సాధ్యం కాదని అన్నారు. సరిహద్దు ప్రాంతాల్లోని ప్రజల భద్రత కోసం చేపట్టిన చర్యలను అఖిలపక్ష భేటీలో రాజ్‌నాథ్‌ వెల్లడించారు.  

టీఆర్‌ఎఫ్‌ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించాలి  
జాతీయ భద్రత విషయంలో ప్రభుత్వానికి తమ పూర్తి మద్దతు ఉంటుందని కాంగ్రెస్, తృణమూల్‌ కాంగ్రెస్, డీఎంకే, బీజేడీ, జేడీ(యూ), ఎంఐఎం, సీపీఎం తదితర నేతలు ప్రకటించారు. లష్కరే తోయిబా ముసుగు సంస్థ ద రెసిస్టెన్స్‌ ఫ్రంట్‌(టీఆర్‌ఎఫ్‌) అరాచకాలను అంతర్జాతీయ సమాజం దృష్టికి తీసుకెళ్లాలని హైదరాబాద్‌ ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవెసీ సూచించారు. టీఆర్‌ఎఫ్‌ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించాలని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలికి విజ్ఞప్తి చేశారు. పహల్గాం ఉగ్రదాడిలో మృతిచెందిన వినయ్‌ నర్వాల్‌ భార్య హిమాన్షి నర్వాల్‌పై సోషల్‌ మీడియాలో ట్రోలింగ్‌ జరుగుతుండడం పట్ల ఒవైసీ ఆగ్రహం వ్యక్తంచేశారు. 

ప్రస్తుత పరిస్థితుల్లో దేశంలో మత సామరస్యం కోసం అందరూ కలసికట్టుగా కృషి చేయాలని విపక్ష నేతలు పిలుపునిచ్చారు. భారత వైమానికి దళానికి చెందిన ఐదు యుద్ధ విమానాలు కూల్చివేసినట్లు పాకిస్తాన్‌ చెబుతోందని, ఈ తప్పుడు ప్రచారాన్ని గట్టిగా తిప్పికొట్టాలని పలువురు నాయకులు కేంద్రాన్ని కోరారు. పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశం నిర్వహించాలని, దేశమంతా ఐక్యంగా ఉందన్న సందేశాన్ని ప్రపంచానికి అందించాలని సూచించారు. అఖిలపక్ష సమావేశానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరు కాకపోవడం పట్ల కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అసంతృప్తి వ్యక్తంచేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement