ముఫ్తీని కలిసిన ఫరూఖ్, ఒమర్‌

Omar Abdullah Meets Mehbooba Mufti And Farooq Abdullah - Sakshi

గుప్కర్‌ డిక్లరేషన్‌ సమావేశానికి ఆహ్వానం

శ్రీనగర్‌: పద్నాలుగు నెలల నిర్బంధం తరువాత విడుదలైన జమ్మూకశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీని, మాజీ ముఖ్యమంత్రులు ఫరూఖ్‌ అబ్దుల్లా, ఒమర్‌ అబ్దుల్లాలు శ్రీనగర్‌లోని ఆమె నివాసంలో కలిసి, యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఫరూఖ్‌ అబ్దుల్లా గురువారం ఏర్పాటు చేసిన గుప్కర్‌ డిక్లరేషన్‌ సమావేశానికి హాజరుకావాల్సిందిగా పీడీపీ నాయకురాలు ముఫ్తీని కోరామని, అందుకు ఆమె సమ్మతించినట్లు ఒమర్‌ అబ్దుల్లా ట్వీట్‌ చేశారు. ఆగస్టు 4, 2019న జరిగిన అఖిల పక్ష సమావేశం గుప్కర్‌ డిక్లరేషన్‌ తీర్మానాన్ని ఆమోదించింది.

కేంద్ర ప్రభుత్వం జమ్మూకశ్మీర్‌ స్వయం ప్రతిపత్తిని రద్దు చేస్తూ, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల ఏర్పాట్లను వ్యతిరేకిస్తూ, కశ్మీర్‌ స్వయం ప్రతిపత్తి, ప్రత్యేక హోదాను, గుర్తింపులను కాపాడుకోవడానికి ఐక్యంగా పోరాడాలని కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి ఒక రోజు ముందు జరిగిన సమావేశంలో అన్ని పార్టీలూ ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించాయి. ఈ యేడాది ఆగస్టులో సమావేశమైన పార్టీలు తమ పోరాటాన్ని కొనసాగించాలని నిర్ణయించాయి. ఈ నేపథ్యంలో భవిష్యత్‌ కార్యాచరణను నిర్ణయించడానికి గురువారం ఏర్పాటు చేయనున్న సమావేశానికి అన్ని పార్టీలను ఫరూఖ్‌ అబ్దుల్లా ఆహ్వానించారు. నిర్బంధం నుంచి విడుదలైన ముఫ్తీ మాట్లాడుతూ గత ఏడాది ఆగస్టు 5న అప్రజాస్వామికంగా, రాజ్యాంగ విరుద్ధంగా మన నుంచి లాగేసుకున్న జమ్మూకశ్మీర్‌ని తిరిగి సాధించుకోవడానికి ప్రతిజ్ఞ పూనాలని అన్నారు.
 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top