బెంగళూరు: ప్రతి తరగతి గదిలో ఇకపై చివరి బెంచ్ ఉండదు. యూ ఆకారంలో లేదా వృత్తాకారంలో బెంచ్లు ఏర్పాటు చేస్తారు. కేరళలో ఇదే విధానం కొనసాగుతోంది. ఇదేవిధానాన్ని రాష్ట్రంలో ఈ విద్యా సంవత్సరం నుంచి అమలు చేయాలని విద్యాశాఖ యోచిస్తోంది. చదువులో వెనుకబడిన విద్యార్థులను వెనుకబెంచ్లో కూర్చొబెడతారనే అపవాదు ఉండేది. దీంతో చివరి బెంచ్లో కూర్చునే విద్యార్థులకు సరైన ప్రోత్సాహం ఉండేది కాదు.
దీంతో ప్రతి ఒక్క విద్యార్థిపై ఉపాధ్యాయులు దృష్టి పెట్టేలా వృత్తాకార, లేదా యూ ఆకారంలో బెంచీలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ విధానం వల్ల విద్యార్థుల్లో ఉత్సాహం నెలకొంటుందని, ఇన్నాళ్లూ తాము చివరి బెంచీకి పరిమితం అయ్యామనే వేదన వారిలో తొలగిపోతుందని భావిస్తున్నారు. సంప్రదాయ వరుస ఆసనాల వ్యవస్థకంటే కేరళ విధానంలో విద్యార్థులను కూర్చొబెట్టడం ద్వారా విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంచినట్లు అవుతుందని విద్యానిపుణుల అభిప్రాయం.
యూ ఆకార ఆసనాల వ్యవస్థలో ఉపాధ్యాయులు తరగతి కేంద్రభాగాల్లో నిల్చొని పాఠాలు చెబుతారు. దీంతో విద్యార్థులందరూ శ్రద్ధగా పాఠాలు వింటారు. పాఠ్యాంశాలు సులభంగా అర్థమవుతాయి. అంతేగాకుండా విద్యార్థులతో బృంద చర్చలు, పాఠ్యాంశాలలో సందేహాలు తీర్చుకునేందుకు ఈ విధానం అత్యుత్తమమైనదని నిపుణులు భావిస్తున్నారు.


