కొత్త వాహనం కొంటే ఈ20 పెట్రోల్ పోయొచ్చా? కొత్తగా వచ్చిన ఈ పెట్రోల్ అసలు పాత బండ్లకు పనికొస్తుందా?. ఇథనాల్తో ఇంజిన్ పాడు కాదా? మైలేజ్ తగ్గిపోదా? చెరకు నుంచి తయారయ్యే ఇథనాల్ కోసం నీటిని విచ్చలవిడిగా వాడుతున్నారా? తీపి గుణం వల్ల బండికి చీమలు పడుతున్నాయా? దీని తయారీలో పర్యావరణ కాలుష్యం జరుగుతుందా?.. ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ క్లెయిమ్స్తో ఈ ప్రశ్నలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. దీనికి తోడు సుప్రీంకోర్టు విచారణ సందర్భంగా కేంద్రం ఈ20ను "ప్రయోగం"గా అభివర్ణించిందంటూ వచ్చిన వార్తలు మరింత గందరగోళానికి దారితీశాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరోసారి రంగంలోకి దిగింది.
ఈ20 ఎలాంటి ప్రయోగం కాదని.. శాస్త్రీయ పరీక్షలు, ఆటోమొబైల్ తయారీ సంస్థలతో విస్తృత సంప్రదింపులు, నిపుణుల సిఫార్సుల తర్వాతే దేశవ్యాప్తంగా అమలు చేస్తున్నామని తెలిపింది. 2023 నుంచి తయారవుతున్న చాలా కొత్త వాహనాలు ఈ20 ఇంధనాన్ని దృష్టిలో పెట్టుకునే రూపొందించబడినవేనని పేర్కొంది.
సోషల్ మీడియాలో ప్రచారం.. కేంద్రం వివరణ
👉"ఈ20 వల్ల ఇంజిన్ పాడవుతుంది" అనేదే. దీనిపై కేంద్రం స్పష్టంగా స్పందించింది. ఈ20కు అనుకూలంగా రూపొందించిన వాహనాల్లో ఇంజిన్ దెబ్బతింటుందనే వాదనకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని తెలిపింది. ఇప్పటికే లక్షలాది వాహనాలు ఈ20ను ఉపయోగిస్తున్నప్పటికీ, పెద్దఎత్తున ఇంజిన్ సమస్యలు నమోదైన దాఖలాలు లేవని వివరించింది.
👉ఇథనాల్ ఎక్కువగా నీటిని పీల్చుకుంటుందన్న ప్రచారాన్ని కూడా ప్రభుత్వం తోసిపుచ్చింది. ఇంధన ట్యాంకులోకి నీరు చేరడం ఏ రకమైన పెట్రోల్కైనా సమస్యేనని, అది ఈ20కు మాత్రమే సంబంధించిన అంశం కాదని వివరించింది. ఆధునిక వాహనాల్లో ఇందుకు తగిన సాంకేతిక భద్రతా వ్యవస్థలు ఉన్నాయని తెలిపింది.
👉మరోవైపు చెరకు రసాన్ని నేరుగా పెట్రోల్లో కలుపుతున్నారు. ఇథనాల్ వల్ల బండికి చీమలు వస్తున్నాయి అంటూ సో.మీ.లో జరుగుతున్న ప్రచారాలను కూడా కేంద్రం అవాస్తవాలుగా కొట్టిపారేసింది. ఇంధనంగా వినియోగించే ఇథనాల్ అనేది చెరకు రసం, మొలాసిస్, మొక్కజొన్న, విరిగిన బియ్యం వంటి ముడి పదార్థాల నుంచి పలు పారిశ్రామిక ప్రక్రియల ద్వారా తయారవుతుందని వివరించింది. అందులో చక్కెర ఉండదని, కాబట్టి చీమలు వస్తాయన్న వాదనకు శాస్త్రీయ ఆధారం లేదని స్పష్టం చేసింది.
👉ఈ20 వాడితే వాహన బీమా చెల్లదన్న ప్రచారాన్నీ కేంద్రం ఖండించింది. బీమా సంస్థల నిబంధనల్లో అలాంటి షరతులేమీ లేవని తెలిపింది. అలాగే ఈ20 ఇంధనం భారత్కు కొత్తైనా... ప్రపంచానికి కొత్త కాదని గుర్తు చేసింది. బ్రెజిల్లో ఈ27, అమెరికాలో ఈ15, ఈ85 వంటి ఇథనాల్ మిశ్రమ ఇంధనాలు చాలాకాలంగా వినియోగంలో ఉన్నాయని వివరించింది.
ఇలా.. ఈ20పై వైరల్ అవుతున్న ప్రతి అపోహకు ఒక్కొక్కటిగా సమాధానం చెప్పింది. వాస్తవానికి ఈ వివాదానికి కారణం సుప్రీంకోర్టులో జరిగిన ఓ విచారణ. ఇథనాల్ కేటాయింపులకు సంబంధించిన కేసు విచారణ సందర్భంగా ప్రభుత్వం ఈ20 కార్యక్రమం ఇంకా ప్రయోగ దశలోనే ఉందని కోర్టుకు చెప్పిందంటూ కొన్ని మీడియా కథనాలు వెలువడ్డాయి. దీంతో సోషల్ మీడియాలో "ప్రజలపై ప్రయోగం చేస్తున్నారా?" అంటూ పెద్ద ఎత్తున చర్చ మొదలైంది.
అయితే ఈ వార్తలను అటార్నీ జనరల్ కార్యాలయం వెంటనే ఖండించింది. కోర్టులో ప్రభుత్వం అలాంటి వ్యాఖ్యలేవీ చేయలేదని, న్యాయవాదనలను తప్పుగా అర్థం చేసుకుని కొన్ని మీడియా సంస్థలు వార్తలు ప్రసారం చేశాయని స్పష్టం చేసింది. ఇటు.. పెట్రోలియం, సహజవాయు మంత్రిత్వ శాఖ కూడా పూర్తి వివరణ విడుదల చేసింది.
ఈ20 కార్యక్రమం వల్ల దేశానికి కలుగుతున్న ప్రయోజనాలను కూడా ప్రభుత్వం వివరించింది. ముడి చమురు దిగుమతులపై ఆధారపడటం తగ్గడంతో ఇప్పటివరకు రూ.1.4 లక్షల కోట్లకు పైగా విదేశీ మారకద్రవ్యం ఆదా అయిందని తెలిపింది. రైతులకు అదనపు ఆదాయం లభిస్తోందని, కార్బన్ ఉద్గారాలు తగ్గుతున్నాయని పేర్కొంది. దేశ ఇంధన భద్రతను బలోపేతం చేయడంలో ఈ20 కీలక పాత్ర పోషిస్తోందని వెల్లడించింది.
సుప్రీంకోర్టు వ్యాఖ్యలపై వచ్చిన గందరగోళం, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అపోహలు... ఈ రెండింటి నేపథ్యంలో కేంద్రం స్వయంగా వివరణ ఇవ్వడం ఇప్పుడు ఈ20పై నెలకొన్న అనేక సందేహాలకు తెరదించింది. అయినప్పటికీ పాత వాహనాల్లో ఈ20 వినియోగానికి సంబంధించి తయారీ సంస్థల సూచనలను పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు.


