Night Curfew: మహారాష్ట్రలో రాత్రి కర్ఫ్యూ
రాత్రి 8 నుంచి ఉదయం 7 గంటల వరకు
సాక్షి ముంబై: మహారాష్ట్రలో 27వ తేదీ అర్ధరాత్రి నుంచి అమలుకానున్న నైట్ కర్ఫ్యూకు సంబంధించిన మార్గదర్శకాలను మహారాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఈ నైట్ కర్ఫ్యూ రాత్రి ఎనిమిది గంటల నుంచి ఉదయం ఏడు వరకూ ఉండనుంది. అయితే అత్యవసర సేవలను ఇందులోనుంచి మినహాయించారు. మరోవైపు ఆంక్షలను మరింత కఠినతరం చేశారు. మాస్క్ లేకుండా తిరిగితే రూ. 500, బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మితే రూ. 1000, కర్ఫూ సమయంలో అయిదుగురికంటే ఎక్కువ మంది గుమిగూడితే రూ. 1000 జరిమానా వసూలు చేయనున్నారు. ఈ ఆదేశాలు ఏప్రిల్ 15వ తేదీ వరకు అమల్లో ఉండనున్నాయి.
మార్గదర్శకాల వివరాలు...
► రాత్రి ఎనిమిది గంటల నుంచి ఉదయం ఏడు గంటల వరకు నైట్ కర్ఫ్యూ అమలులో ఉంటుంది.
► కర్ఫ్యూ సమయంలో బీచ్లు, ఉద్యానవనాలు, సార్వజనిక ప్రాంతాలు మూసేయనున్నారు.
► కర్ఫ్యూ సమయంలో అయిదుగురికంటే ఎక్కువ మంది గుమిగూడరాదు.
► బహిరంగ ప్రాంతాల్లో ఉమ్మివేయరాదు.
► ముఖానికి మాస్క్, కనీసం ఆరు అడుగుల దూరం (సోషల్ డిస్టిన్స్). చేతులను తరచు సానిటైజ్ చేసుకోవాలి.
► మాస్క్ లేకుంటే రూ 500 జరిమానా
► బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేసి నియమాను ఉల్లంఘిస్తే రూ. 1000 జరిమానాను వసూలు చేయనున్నారు.
► కర్ఫ్యూ సమయంలో సినిమా హాళ్లు, హోటళ్లు, మల్టిప్లెక్స్, బార్లు అన్ని మూసి ఉండనున్నాయి. అయితే హోటళ్లు హోం డెలివరి చేసుకోవచ్చు.
► వివాహానికి 50 మందికి అవకాశం.
► అంత్యక్రియలకు 20 మంది మించకూడదు.
► ధార్మిక స్థలాలలో భౌతిక దూరం పాటించేలా ఆయా ధార్మిక స్థలాల ట్రస్టులు చూడాలి. అదేవిదంగా ఆన్లైన్ దర్శనం కల్పించాలి. అన్ని నియమాలతోనే ధార్మిక స్థలాల్లోకి అనుమతించాలి.
► కొన్ని ఆంక్షలతో ప్రజా రవాణా కొనసాగుతుంది.
► ప్రైవేట్ సంస్థలు (ఆరోగ్య, అత్యవసర సేవలు మినహా) 50 శాతం సిబ్బంది మాత్రమే విధులకు హాజరయ్యేలా చూడాలి.