‘వంద మంది పోలీసులు మావాళ్లని కుమ్మేశారు’ | Nearly 100 policemen lathi-charged our workers’: Maha minister | Sakshi
Sakshi News home page

‘వంద మంది పోలీసులు మావాళ్లని కుమ్మేశారు’

Jan 16 2026 1:52 PM | Updated on Jan 16 2026 2:44 PM

Nearly 100 policemen lathi-charged our workers’: Maha minister

ముంబై: మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్‌లో స్థానిక సంస్థల ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. కౌంటింగ్ కేంద్రంలోకి వస్తున్న తమ పార్టీ కార్యకర్తలపై పోలీసులు విచక్షణారహితంగా  దాడి చేశారని మహారాష్ట్ర మంత్రి సంజయ్ శిర్సత్ సంచలన ఆరోపణలు చేశారు. దాదాపు 100 మంది పోలీసులు తమ కార్యకర్తలపై లాఠీఛార్జ్ చేసి, తీవ్రంగా గాయపరిచారని ఆయన  ఆరోపించారు.

‘పోలీసులు తమ ప్రతాపం నేరస్తుల మీద చూపించాలి కానీ.. కార్యకర్తల మీద కాదు.. ఇది అధికార దుర్వినియోగమే. బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలి. మేము దీనిపై మెడికో లీగల్ కేసు (ఎంఎల్‌సీ)నమోదు చేస్తున్నాం" అని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఛత్రపతి శంభాజీనగర్ లోకల్ మున్సిపల్ కార్పొరేషన్ (ఎల్‌ఎంసీ)ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైన సమయంలో ఈ ఘటన వెలుగుచూసింది. ఇక్కడ మొత్తం 18 వార్డుల్లోని 70 స్థానాలకు పోలింగ్ జరిగింది. మేజిక్ ఫిగర్ సాధించడానికి 36 స్థానాలు అవసరం కాగా, జనవరి 15న జరిగిన పోలింగ్‌లో నగరంలో 60.07 శాతం ఓటింగ్ నమోదైంది. ఇక్కడ ప్రధాన పోటీ భారతీయ జనతా పార్టీ , భారత జాతీయ కాంగ్రెస్ (ఐఎన్‌సీ) మధ్య నెలకొంది. కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుండగానే ఈ లాఠీఛార్జ్ ఘటన జరగడంతో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది.
 

రాష్ట్రంలోని 29 మున్సిపల్ కార్పొరేషన్లకు జరిగిన ఈ ఎన్నికల్లో అధికార మహాయుతి కూటమి ఘనవిజయం సాధిస్తుందంటూ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. నాలుగేళ్ల ఆలస్యం తర్వాత, శివసేనలో చీలిక వచ్చి షిండే ప్రభుత్వం ఏర్పడిన అనంతరం జరుగుతున్న తొలి బీఎంసీ ఎన్నికలు కావడంతో వీటిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. గురువారం జరిగిన పోలింగ్‌లో ముంబైలో 52.94 శాతం ఓటింగ్ నమోదైంది. ఇది 2017లో నమోదైన 55.53 శాతంతో పోలిస్తే తక్కువ కావడం గమనార్హం. 

ఇది కూడా చదవండి: ‘బీఎంసీ’ ఓట్ల లెక్కింపు వేళ.. రాహుల్‌ సంచలన వ్యాఖ్యలు
 

Advertisement
 
Advertisement
Advertisement