
కేరళ రాష్ట్రం ట్రాఫిక్ ఉల్లంఘనలు జరగకుండా ఉండేందుకు అత్యాధునిక ట్రాఫిక్ కెమరాలను ఏర్పాటు చేసింది. ఆ ట్రాఫిక్ కెమెరాలు ప్రస్తుతం వివాదస్పదమవ్వడమే గాక ఏకంగా ఓ కుంటుంబంలో కలతలు తెచ్చిపెట్టింది. కేరళలోని ఓ వ్యక్తి ఓ మహిళా స్నేహితురాలితో బైక్పై ప్రయాణించాడు. అతడు ఆ సమయంలో హెల్మెట్ ధరించలేదు.
దీంతో బైక్ ఎవరి పేరు మీద రిజిస్టర్ అయ్యిందో వారి మొబైల్కి ఫోటోతో సహా మెసేజ్ వెళ్లింది. ఐతే అతడి బైక్ భార్య పేరు మీద ఉండటంతో ఆమె మొబైల్కి మెసేజ్ వచ్చింది. దీంతో ఆమె బైక్పై ఎక్కించుకున్న మహిళ ఎవరని ప్రశ్నించింది భార్య. నిజానికి ఆ మహిళ ఎవరో తనకు తెలియదని, తాను కేవలం ఆమెకు లిఫ్ట్ ఇచ్చానని భార్యాతో చెప్పాడు.
కానీ ఆమె నమ్మలేదు. దీంతో ఇరువురి మద్య ఈ విషయమై గొడవలయ్యాయి. ఆ తర్వాత ఆమె తనపట్ల, కూతురి పట్ల అసభ్యంగా ప్రవర్తించాడంటూ భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం ఆ వ్యక్తిని కోర్టులో హాజరుపర్చడమే గాక జ్యుడిషియల్ కస్టడీకి తరలించామని అధికారులు తెలిపారు. కాగా, సేఫ్ కేరళలో భాగంగా రోడ్డు భద్రతా ప్రాజెక్టు రహదారులపై ఈ అత్యాధునిక ట్రాఫిక్ కెమెరాలను ఏర్పాటు చేసింది. ఈ కెమెరాల ఒప్పందాల్లో చాలా అవినీతి జరిగిందంటూ కేరళ ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఇప్పుడు ఆ కెమెరాలు సామాన్య ప్రయాణికుల వ్యక్తిగత జీవితాలను ఇబ్బంది పాలు చేస్తుండటం బాధకరం.
(చదవండి: కేరళలో వైద్యురాలి మృతి కలకలం..చికిత్స చేస్తుండగా పెషెంట్..)