ఘోరం: గర్భిణి అని కూడా చూడకుండా.. | Madhya Pradesh's Pregnant Woman Dowry Case | Sakshi
Sakshi News home page

ఘోరం: గర్భిణి అని కూడా చూడకుండా.. అత్తింటివారే..

Jul 24 2024 11:14 AM | Updated on Jul 24 2024 11:37 AM

Madhya Pradesh's Pregnant Woman Dowry Case

మధ్యప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. కట్నం కోసం అత్తమామలు కోడలిని హింసించి, అత్యంత దారుణంగా హతమార్చిన ఉదంతం వెలుగుచూసింది. స్థానికంగా ఈ ఘటన సంచలంగా మారింది.

వివరాల్లోకి వెళితే మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్ జిల్లాలో రీనా తన్వర్ అనే 23 ఏళ్ల గర్భిణి దారుణ హత్యకు గురైంది. ఆమె చేతులు, కాళ్లు నరికి, మిగిలిన శరీరానికి నిప్పంటించారు. విషయం తెలుసుకున్న రీనా పుట్టింటివారు తమ కుమార్తెను ఆమె భర్త మిథున్, అత్తమామలు కట్నం కోసం వేధింపులకు గురిచేసి, హత్య చేశారని ఆరోపించారు.

ఈ విషాదకర సంఘటన కలిపిత్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తాండి ఖుర్ద్ గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఓ వ్యక్తి  రీనా హత్య గురించి ఆమె కుటుంబసభ్యులకు తెలిపాడు. వెంటనే రీనా తండ్రి రాంప్రసాద్ తన్వర్ పోలీసులతో పాటు తాండి ఖుర్ద్‌కు చేరుకున్నాడు. వీరిని గమనించిన రీనా అత్తమామలు కోడలి చితి దగ్గర నుంచి పారిపోయారు. దీంతో రీనా తండ్రి అక్కడ మండుతున్న చితిని ఆర్పివేసి సగం కాలిన కుమార్తె మృతదేహాన్ని ఒక గుడ్డలో చుట్టారు. అనంతరం పోలీసులు ఆ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రీనా తన్వర్‌కు మిథున్‌ తన్వర్‌తో ఐదేళ్ల క్రితం వివాహమైంది. వారికి ఏడాదిన్నర వయసున్న కుమార్తె ఉంది. ప్రస్తుతం రీనా నాలుగు నెలల గర్భవతి. రీనా అత్తమామలు అనునిత్యం డబ్బులు డిమాండ్ చేస్తూ, తమ కుమార్తెను వేధిస్తున్నారని ఆమె తండ్రి రాంప్రసాద్ తన్వర్ పోలీసుల ముందు ఆరోపించారు. అతని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు కలిపిత్ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ రజనీష్ సిరోథియా తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement