పెళ్లికి ముందే తన కలను నెరవేర్చుకున్న నూతన వధువు

Madhya Pradesh New Bride Wish Became Viral On Social Media - Sakshi

భోపాల్: ఈ మధ్య పెళ్లిళ్లు వెరైటీగా జరగడం చూస్తున్నాం. ఆ మధ్య పెళ్లి జరిగిన తర్వాత ఊరేగింపులో వధువు 'బుల్లెట్టు బండెక్కి' అనే పాటకు వరుడు, బంధువులందరి ముందే డ్యాన్స్‌ చేసిన వీడియో వైరల్‌ కావడం చూసాం. అలాంటి ఘటనే మరొకటి మధ్యప్రదేశ్‌లో జరిగింది. అయితే ఇక్కడ మాత్రం వధువు పెళ్లి మండపానికి స్కూటర్‌పై వచ్చింది. వధువు స్కూటర్‌పై ఒంటరిగా వస్తే అందులో వింతేముంది? తను వచ్చింది ఒంటరిగా కాదు.. తనకు కాబోయే భర్త అంటే పెళ్లి కొడుకుని తన స్కూటీ వెనుక సీటుపై కూర్చోబెట్టుకొని పెళ్లి మండపానికి తీసుకొచ్చింది.

అయితే ఈఘటన మధ్యప్రదేశ్‌లోని నీముచ్‌ నగరంలో జరిగింది. వధువు పేరు నీలు దమామి. నీముచ్ సిటీలో నివసించే బాల్ముకాంద్‌కుమార్తె నీలుకు మానస టౌన్‌కు చెందిన అర్జున్‌తో ఈ జనవరి 16న వివాహం జరిగింది. అయితే వీరి పెద్దలు వివాహ వేదికను దగ్గరలోని ఓ ఫంక్షన్‌ హాలులో ఏర్పాటు చేశారు. దాంతో వధువు నీలు ఇంటి నుంచి కల్యాణ మండపానికి తన స్కూటర్‌పై వెళ్లాలని ముచ్చటపడింది. ఇక అదే విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో అంగీకరించారు.

ఇంకేముందు తల్లిదండ్రులు కూడా పర్మిషన్‌ ఇవ్వడంతో తన కాబోయే భర్తను స్కూటీపై కూర్చొబెట్టుకొని పెళ్లి దుస్తుల్లో ఇద్దరూ కల్యాణ మండపానికి చేరుకున్నారు. ఈ ఘటనకు సంబందించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే మొదట వీరిని చూసి ఆశ్చర్యపోయిన బంధువులు తర్వాత వాళ్ళకి పూలమాలలు వేసి బ్యాండ్‌ మేళం నడుమ కల్యాణ వేదిక దగ్గరకు తీసుకెళ్లారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top