లోక్‌సభ ఎన్నికల్లో  తక్కువ ఖర్చు వైఎస్సార్‌సీపీదే

Lowest Expenses In Lok Sabha Elections In YSRCP - Sakshi

అతి తక్కువగా వైఎస్సార్‌సీపీ ఎంపీల ఎన్నికల ఖర్చు రూ.26.94 లక్షలు

అత్యల్పంగా గొడ్డేటి మాధవి ఖర్చు రూ.14.12 లక్షలు

రామ్మోహన్‌నాయుడు వ్యయం రూ.65,07,355

ముగ్గురు టీడీపీ ఎంపీల సరాసరి ఖర్చు రూ.49,31,177

2019 లోక్‌సభ ఎన్నికల్లో ఎంపీల వ్యయాన్ని వెల్లడించిన ఎలక్షన్‌ వాచ్, ఏడీఆర్‌

సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్‌ ఎన్నికల్లో ఎన్నికల కమిషన్‌ నిర్ణయించిన వ్యయం కన్నా తక్కువ ఖర్చు చేసిన ప్రధాన పార్టీల్లో వైఎస్సార్‌సీపీ తొలిస్థానంలో నిలిచింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసిన 543 మంది ఎంపీలకుగానూ 538 మంది అఫిడవిట్‌లలో పొందుపరిచిన వ్యయాలను ఎలక్షన్‌ వాచ్‌/ఏడీఆర్‌ సంస్థ ప్రకటించింది. ఎన్నికల ఖర్చు వివరాలు ప్రకటించని ఐదుగురు ఎంపీల్లో నంద్యాల ఎంపీ పోచ బ్రహ్మానందరెడ్డి, నరసాపురం ఎంపీ కనుమూరి రఘురామకృష్ణరాజు ఉన్నారు. వీరి వ్యయం వివరాలు లభ్యం కాలేదని సంస్థ వెల్లడించింది. 

మాధవి ఖర్చు రూ.14.12 లక్షలు
ఎన్నికల ఖర్చులో వైఎస్సార్‌ సీపీ ఎంపీలు గొడ్డేటి మాధవి 537వ స్థానం(రూ.14.12 లక్షలు), బల్లి దుర్గాప్రసాదరావు 535వ స్థానం (రూ.15.06 లక్షలు), బెల్లాన చంద్రశేఖర్‌ 533వ స్థానం (రూ. 15.83 లక్షలు), చింతా అనూరాధ 532వ స్థానం (రూ.16,74 లక్షలు), భీశెట్టి వెంకట సత్యవతి 531వ స్థానం(రూ.17.66 లక్షలు)లో ఉన్నారు. 

అనంత్‌నాగ్‌లో అత్యధికంగా..
లోక్‌సభ ఎన్నికల అభ్యర్థి ఖర్చు పెద్ద రాష్ట్రాల్లో రూ.70 లక్షలు, చిన్న రాష్ట్రాల్లో రూ.54 లక్షలుగా కమిషన్‌ నిర్ణయించింది. అత్యధికంగా ఖర్చు (నిబంధనల కంటే ఎక్కువగా) చేసినవారిలో హస్నైన్‌ మసూది (అనంతనాగ్, జమ్మూ కశ్మీర్, జేకే నేషనల్‌ కాన్ఫరెన్స్‌) రూ.79,27,920తో తొలిస్థానంలో నిలవగా రూ.77,95,916తో గోరఖ్‌పూర్‌ బీజేపీ సభ్యుడు రవికిషన్‌ రెండో స్థానంలో ఉన్నట్లు సంస్థ తెలిపింది.

శివసేన తరువాత టీఆర్‌ఎస్‌...
ఎన్నికల వ్యయం వివరాలను వెల్లడించిన 538 మంది ఎంపీల సరాసరి ఖర్చు రూ.50.84 లక్షలని కమిషన్‌ పేర్కొంది. ఎంపీ అభ్యర్థి ఖర్చు విషయంలో పార్టీల వారీగా చూస్తే శివసేన (18 మంది ఎంపీలు) రూ.59.26 లక్షల సరాసరి ఖర్చుతో తొలిస్థానంలో నిలిచింది. టీఆర్‌ఎస్‌ (9 మంది ఎంపీలు) రూ.57.85 లక్షల సరాసరి ఖర్చుతో ద్వితీయ స్థానంలో ఉంది. వైఎస్సార్‌ సీపీ ఎంపీ గొడ్డేటి మాధవి ఎన్నికల వ్యయంలో సొంత డబ్బులు రూ.13,500 కాగా రూ.6,65,580 పార్టీ నుంచి అందించగా రూ.7,33,100 ఇతరత్రా విరాళాల రూపంలో సమకూరాయి. బీజేపీ ఎంపీ సోయం బాపూరావు వ్యక్తిగత డబ్బులు రూ.28,500 కాగా పార్టీ విరాళం రూ.49,99,693.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top