పిడుగుల బీభత్సం: 35 మంది దుర్మరణం, సీఎం సంతాపం

Lightning strike across UP, 35 Killed - Sakshi

సాక్షి, లక్నో: దేశవ్యాప్తంగా భారీగా కురిసిన వానలు, పిడుగులు బీభత్సం సృష్టించాయి. ఉత్తరప్రదేశ్‌లో  రాష్ట్రవ్యాప్తంగా పిడుగుపాటుకు దాదాపు 35 మంది  ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. దీనికి తోడు పశు నష్టం కూడా సంభవించడం కలకలం రేపింది. ప్రాణ, పశువుల నష్టంపై నివేదిక సమర్పించాలని ప్రభుత్వం స్థానిక అధికారులను ఆదేశించింది.

యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో ఏకంగా 14 మంది పిడుగుపాటుతో దుర్మరణం పాలయ్యారు. కాన్పూర్‌లో అయిదుగురు, ఘజియాబాద్‌లో ముగ్గురు, కౌశుంబిలో మరో ముగ్గురు చని పోగా,  ఉన్నావ్‌, చిత్రకూట్‌ ప్రాంతాలలో నలుగురు చొప్పున మరణించారు. ముఖ్యంగా భారీ వర్షం కారణంగా చెట్ల కింద ఆశ్రయం​ పొందిన రైతులు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. కౌశంబి గామానికి చెందిన రుక్మ, మూరత్‌, రామచంద్ర, మయాంక్‌ సింగ్‌, అలాగే ఫిరోజాబాద్‌ మృతులను రామ్‌సేవక్, హేమరాజ్‌గా గుర్తించారు. అదేవిధంగా నాగ్లత్ చాత్ గ్రామంలో మరో రైతు అమర్ సింగ్ కూడా  ప్రాణాలు కోల్పోయారు.

ఈ ఘటనలపై యూపీ సీఎం యెగి ఆదిత్యనాథ్‌ సంతాపం తెలిపారు.మృతుల కుటుంబాల‌కు తగిన సాయం అందిస్తామని ప్రకటించారు. అటు భారీ వర్షాలు, పిడుగుల కారణంగా పశు నష్టం కూడా భారీగానే సంభవించింది. యూపీలోని ఉడ్ని గ్రామంలో పిడుగుపాటుకు 44 జంతువులు చనిపోయాయి. 42 మేక‌లు, ఒక ఆవు, ఎద్దు మృతి చెందిన‌ట్లు అధికారులు వెల్లడించారు.

మరోవైపు రాజస్థాన్‌ ఒక్క జైపూర్‌లోనే 16 మంది మృతి చెంద‌గా, 25 మందికి తీవ్ర గాయాల‌య్యాయి. పిడుగుపాటుపై సీఎం అశోక్ గెహ్లాట్ సానుభూతిని తెలిపారు. రాజ‌స్థాన్ సీఎం సాయంగా.. మృతుల కుటుంబాల‌కు రూ. 5 ల‌క్ష‌ల ప‌రిహారం ప్ర‌క‌టించారు.

పీఎంఎన్‌ఆర్‌ఎఫ్ నుంచి ప్రధాని మోదీ సాయం
ఉత్తరప్రదేశ్‌, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో పిడుగుల బీభత్సం కారణంగా ప్రాణాలు కోల్పోవడంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సంతాపం  తెలిపారు. బాధిత కుటుంబాలకు నేషనల్ రిలీఫ్ ఫండ్ నుంచి రూ .2 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియాను ప్రకటించారు. అలాగే గాయపడిన వారికి 50,000 రూపాయల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top