ఒక్క క్షణం ఆలస్యమై ఉంటే... ఓ ప్రాణం గంగలో కలిసిపోయేది. వంతెన రైలింగ్పై నిలబడి కిందకు దూకేందుకు సిద్ధమైంది ఓ యువతి. కింద వందలాది మంది చూస్తున్నారు.. కానీ ఎవరూ దగ్గరకు వెళ్లలేకపోయారు. చివరికి ఓ యువకుడు ప్రాణాలకు తెగించి చేసిన సాహసం... ఆ యువతి ప్రాణాన్ని నిలబెట్టింది. అసలు ఆమె ఆత్మహత్యకు ఎందుకు ప్రయత్నించింది? ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో జరిగిన ఆ ఉత్కంఠభరిత ఘటన గురించి తెలుసుకుందాం...
వారణాసిలోని మాలవీయ వంతెనపైకి డార్జిలింగ్, నార్త్ పాయింట్ టుక్వార్కు చెందిన 23 ఏళ్ల యువతి ఎక్కింది. గంగానదిలో దూకేందుకు ప్రయత్నించింది. అక్కడ పెద్ద సంఖ్యలో ప్రజలు చేరుకుని ఆమెను కిందకు దిగాలని సూచనలు చేశారు. అయినప్పటికీ ఆ యువతి దిగలేదు. అదే సమయంలో ఓ యువకుడు వంతెన రైలింగ్పైకి ఎక్కి, వెనుక నుంచి ఆమెను పట్టుకుని సురక్షితంగా కాపాడాడు. ఆ తర్వాత మరొకరు కూడా వంతెనపైకి ఎక్కి ఆమెను పట్టుకున్నారు.
ఈ ఘటన మొత్తం వీడియో ఇప్పుడు బయటకు వచ్చింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. యువతి గంగా నదిలో దూకుతానంటూ దాదాపు గంట పాటు అక్కడే నిలబడి అరుస్తూ కనిపించింది. దీంతో వంతెనపై వెళ్లే, వచ్చే వారి రద్దీ పెరిగింది. సమాచారం అందిన 25 నిమిషాల తర్వాత పోలీసులు అక్కడికి చేరుకుని జనాన్ని అక్కడి నుంచి పంపించేశారు.
ఆదంపూర్ పోలీసు ఔట్పోస్ట్ ఇన్ఛార్జి ప్రశాంత్ పాండే తెలిపిన వివరాల ప్రకారం.. ఆ యువతి ఓ ఇన్ఫ్లూయెన్సర్. తన స్నేహితుడి మాటలతో మనస్తాపానికి గురై ప్రాణాలు తీసుకోవాలని నిర్ణయించుకుంది. ఆమెకు కౌన్సెలింగ్ ఇచ్చిన పోలీసులు, ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు.


