Karnataka Unlock 4 : Movie Theater And Colleges Reopen - Sakshi
Sakshi News home page

Karnataka Unlock 4: థియేటర్లు, డిగ్రీ కాలేజీలకు ఓకే

Published Mon, Jul 19 2021 2:16 PM

Karnataka Unlock 4: Cinema Theaters Colleges To Reopen - Sakshi

సాక్షి, బెంగళూరు: అన్‌లాక్‌–4 వెసులుబాట్లు అందుబాట్లోకి వచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా కోవిడ్‌ నేపథ్యంలో గత మూడునెలల నుంచి మూతబడిన సినిమా థియేటర్లను సగం సీట్లతో తెరవడానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. అలాగే డిగ్రీ, ఆపై ఉన్నత విద్యాసంస్థలకూ సై అంది. ఆదివారం కావేరి నివాసంలో ముఖ్యమంత్రి యడియూరప్ప అధ్యక్షతన జరిగిన సీనియర్‌ మంత్రుల సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకున్నారు.  

నేటి నుంచే థియేటర్లు  

  • ఏప్రిల్‌లో కోవిడ్‌ సెకెండ్‌ వేవ్‌ విరుచుకుపడడంతో రాష్ట్రమంతటా సినిమా థియేటర్లకు తాళాలు వేశారు. స్కూళ్లు, కళాశాలలు బంద్‌ అయ్యాయి. ప్రస్తుతం కోవిడ్‌ కేసులు అదుపులోకి రావడంతో  
  • అన్‌లాక్‌– 4కు గేట్లు తీశారు. సోమవారం నుంచి సగం మంది ప్రేక్షకులతో సినిమా టాకీస్‌లను నడుపుకోవచ్చు.  
  • ఈ నెల 26 నుంచి డిగ్రీ, పీజీ తదితర కాలేజీలను ప్రారంభించవచ్చు. అయితే కాలేజీకి హాజరయ్యే విద్యార్థులు  కనీసం ఒక డోస్‌ కోవిడ్‌ టీకా అయినా తీసుకుని ఉండాలి. పబ్, క్లబ్, ఈతకొలనుల మూసివేత కొనసాగుతుంది. లాక్‌డౌన్‌ను దశలవారీగా సడలిస్తున్నట్లు రెవెన్యూ మంత్రి ఆర్‌.అశోక్‌ తెలిపారు.
  • పర్యాటకంపై సడలింపు యోచన 
  • పర్యాటక ప్రాంతాల్లో కరోనా నియమాలను సడలించాలని సర్కారు నిశ్చయంతో ఉంది. లాక్‌డౌన్‌లో ఇళ్లకే పరిమితమైన ప్రజలు పర్యాటక ప్రాంతాలను సందర్శించి ఉవ్విళ్లూరుతుంటారు. ఐటీ ఉద్యోగులకు వర్క్‌ ఫ్రం హోం ఉండడంతో పర్యాటక కేంద్రాల్లో విశ్రాంతి తీసుకుంటూ పని చేసుకోవడానికి మొగ్గు చూపుతున్నారు. కొడగు, చిక్కమగళూరు, మైసూరు ప్రాంతాల్లో అడవులు, రిసార్టు టూర్లకు గిరాకీ పెరుగుతోంది. చారిత్రక ప్రాంతాలైన హంపీ, హళేబీడు, బాదామి తదితర ప్రాంతాల్లోనూ పర్యాటకుల సంఖ్య పెరిగింది. లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తున్న పర్యాటక రంగాన్ని ఆదుకునేలా ఆంక్షలను సడలించి ప్యాకేజీలను ప్రకటించాలని సర్కారు భావిస్తోంది.

మెడికల్‌ కాలేజీలకూ అనుమతి
యశవంతపుర: రాష్ట్రంలో మెడికల్‌ కాలేజీల ప్రారంభానికి అనుమతిస్తున్నట్లు వైద్య ఆరోగ్య మంత్రి కే.సుధాకర్‌ ట్విట్టరలో తెలిపారు. ఆయుష్, దంతవైద్య, పారా మెడికల్‌ కాలేజీలను తెరుచుకోవచ్చని చెప్పారు.  కరోనా టీకా వేయించుకున్న విద్యార్థులు, బోధన సిబ్బంది మాత్రమే హాజరు కావాలన్నారు. మూడో వేవ్‌కు ముందుజాగ్రత్తగా ప్రతి జిల్లా కేంద్రంలో పిల్లల చికిత్సలకు అన్నీ సిద్ధం చేసినట్లు తెలిపారు.   

Advertisement
Advertisement