డీకే కేబినెట్‌లో కొత్త ట్విస్ట్‌.. మంత్రి రాజీనామా | Karnataka Minister Ramalinga Reddy unhappy with portfolio | Sakshi
Sakshi News home page

డీకే కేబినెట్‌లో కొత్త ట్విస్ట్‌.. మంత్రి రాజీనామా

Jun 5 2026 9:17 AM | Updated on Jun 5 2026 10:09 AM

Karnataka Minister Ramalinga Reddy unhappy with portfolio

బెంగళూరు: కర్ణాటక రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. కర్ణాటకలో డీకే శివకుమార్‌ నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేబినెట్ విభజన ప్రక్రియ మరోసారి రాజకీయ ఉద్రిక్తతలకు దారి తీసింది. తన శాఖపై సీనియర్‌ నేత, మంత్రి రామలింగారెడ్డి తీవ్ర అసంతృప్తితో తన పదవికి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. 

రాజీనామా అనంతరం రామలింగారెడ్డి మీడియాతో మాట్లాడుతూ..‘నేను పదవులు ఆశించలేదు. సిద్దరామయ్య, డీకే శివకుమార్‌ కేబినెట్‌లో పదవులు కోరలేదు. నాకు బెంగళూరు డెవలప్‌మెంట్‌ శాఖ ఇస్తామని డీకేనే హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట తప్పినందుకే నా పదవికి రాజీనామా చేస్తున్నాను’ అంటూ బాంబు పేల్చారు. 

మంత్రివర్గంలో అసంతృప్తి..
అయితే, అంతకుముందు శాఖల కేటాయింపు ప్రకటన వెలువడిన వెంటనే కర్ణాటక కాంగ్రెస్‌లో అసంతృప్తి జ్వాలలు తెరపైకి వచ్చాయి. బృహత్ బెంగళూరు అభివృద్ధి (గ్రేటర్ బెంగళూరు డెవలప్‌మెంట్) శాఖను కృష్ణ బైరెగౌడకు కేటాయించడంపై మంత్రి రామలింగారెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. బెంగళూరు అభివృద్ధి శాఖకు బదులుగా రామలింగారెడ్డికి భారీ, మధ్యతరహా నీటిపారుదల శాఖను కేటాయించడంతో ఆయన మండిపడ్డారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి శివకుమార్, రామలింగారెడ్డి, కృష్ణ బైరెగౌడల మధ్య విధాన సౌధలో సుదీర్ఘంగా అత్యవసర చర్చలు జరిగినట్టు వార్తలు బయటకు వచ్చాయి. కాగా, కొత్త ప్రభుత్వం కొలువుదీరిన తొలిరోజే శాఖల సర్దుబాటు వ్యవహారం బెంగళూరు రాజకీయాల్లో కొత్త చర్చకు దారి తీశాయి.

మరోవైపు.. గతంలో కూడా రామలింగారెడ్డికి తగిన ప్రాధాన్యం దక్కలేదన్న భావన ఉన్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దీంతో, ఆయన రాజీనామా చేసే అవకాశం ఉందన్న వార్తలు వినిపిస్తున్నాయి. అయితే పార్టీ పెద్దలు ఆయనను శాంతింపజేసే ప్రయత్నంలో ఉన్నట్లు సమాచారం. కాంగ్రెస్ హైకమాండ్ జోక్యం ద్వారా సమస్య పరిష్కారమవుతుందని అంచనా వేస్తున్నారు. గతంలో కూడా ఆయన రాజీనామా చేసిన సందర్భాల్లో పార్టీ నాయకత్వం జోక్యం చేసుకుని పరిస్థితిని సర్దుబాటు చేసిన సందర్భాలు ఉన్నాయి.

ఇదిలా ఉండగా.. సీఎంగా కొత్త బాధ్యతలు స్వీకరించిన డీకే శివకుమార్ తన కేబినెట్‌లోని సహచర మంత్రులకు శాఖలను కేటాయించారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి డీకే శివకుమార్ అత్యంత ప్రాధాన్యత కలిగిన ఆర్థిక శాఖ, క్యాబినెట్ వ్యవహారాలు, ఇంటెలిజెన్స్ విభాగంతో పాటు పర్సనల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ శాఖలను తన వద్దే ఉంచుకున్నారు. వీటితో పాటు మంత్రులకు కేటాయించని మిగిలిన అన్ని శాఖల బాధ్యతలను కూడా ఆయనే పర్యవేక్షించనున్నారు. ఇక రాష్ట్ర డిప్యూటీ సీఎం బాధ్యతలు స్వీకరించిన సీనియర్ నేత జి. పరమేశ్వరకు రెవెన్యూ, క్రీడా శాఖలను కేటాయించారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కుమారుడు ప్రియాంక్ ఖర్గేకు ఈ కేబినెట్‌లో అత్యంత కీలకమైన హోం మంత్రిత్వ శాఖ (ఇంటెలిజెన్స్ మినహా) బాధ్యతలను అప్పగించారు. అంతేకాకుండా ఐటీ, బయోటెక్నాలజీ, ఈ-గవర్నెన్స్ పోర్ట్‌ఫోలియోలను కూడా ఆయనే చూసుకోనున్నారు. అలాగే మాజీ సీఎం సిద్ధరామయ్య కుమారుడు యతీంద్ర కూడా శివకుమార్ క్యాబినెట్‌లో చోటు దక్కించుకోగా.. ఆయనకు పట్టణాభివృద్ధి (అర్బన్ డెవలప్‌మెంట్) శాఖను కేటాయించారు.

Advertisement
 
Advertisement
Advertisement