రెండో ఆప్షన్ కోసం అన్వేషిస్తున్నా: గవర్నర్ వ్యాఖ్య
Published
Fri, Oct 28 2022 5:43 AM
రాయ్పూర్: లాభదాయక పదవి కేసులో జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ను ఎమ్మెల్యేగా అనర్హుడిగా ప్రకటించాలంటూ వెల్లువెత్తుతున్న డిమాండ్లపై ఆ రాష్ట్ర గవర్నర్ స్పందించారు. ‘ నేనేమీ రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపరిచేవాడిని కాదు. ఈసీ సిఫార్సు తర్వాత తుది నిర్ణయంపై తేల్చుకునేందుకు రెండో ఆప్షన్కు వెళ్తున్నా. నిపుణుల సలహాలు తీసుకుంటున్నా’ అని గవర్నర్ రమేశ్ స్పష్టంచేశారు.
గనుల తవ్వకం లీజును సీఎం సోరెన్ తనకు తానే మంజూరుచేసుకున్నాడనే కేసు నమోదైన విషయం తెల్సిందే. దీంతో లాభదాయక పదవి కోణంలో సోరెన్ ఎమ్మెల్యేగా కొనసాగేందుకు అర్హుడా ? కాదా? అనేది స్పష్టంచేస్తూ ఈసీ నుంచి గవర్నర్కు∙లేఖ వచ్చింది. అందులో ఏముందో తెలీదు. అనర్హుడిగా ప్రకటించాలని ఈసీ సిఫార్సు చేసిందని వార్తలొచ్చాయి. ‘నిపుణుల సలహా తర్వాత జార్ఖండ్లో అణుబాంబ్ పేలొచ్చు’ అని గవర్నర్ వ్యాఖ్యానించడం గమనార్హం.