
ఎమర్జెన్సీకాలంలో ప్రాథమిక హక్కులు ఉండవంటూ ఆనాడు తీర్పిచ్చిన సుప్రీంకోర్టు
తీవ్రంగా తప్పుబట్టిన ఉపరాష్ట్రపతి ధన్ఖడ్
న్యూఢిల్లీ: యాభై ఏళ్ల క్రితం దేశంలో ఎమర్జెన్సీ కొనసాగుతున్నకాలంలో సర్వోన్నత న్యాయస్థానం వెలువర్చిన తీర్పు ప్రపంచ న్యాయచరిత్రలోనే మాయనిమచ్చ అని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ అభివర్ణించారు. దేశంలో అత్యయిక స్థితి విధించి ఈనెల 25వ తేదీతో 50 ఏళ్లుపూర్తవుతున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం 25వ తేదీని ‘సంవిధాన్ హత్యా దివస్’గా జరుపునున్న నేపథ్యంలో ధన్ఖడ్ ఈ వ్యాఖ్యలుచేయడం గమనార్హం.
ఎమర్జెన్సీకాలంలో ప్రాథమిక హక్కులు ఉండవంటూ ఆనాడు తీరి్పచ్చిన సుప్రీంకోర్టును ధన్ఖడ్ తీవ్రంగా తప్పుబట్టారు. శుక్రవారం ఢిల్లీలో రాజ్యసభలో కొత్తగా ఎన్నికైన సభ్యులనుద్దేశించి ధన్ఖడ్ ప్రసంగించారు.
ఈ వివరాలను ఉపరాష్ట్రపతి కార్యాలయం తర్వాత ఒక ప్రకటనలో వెల్లడించింది. ‘‘మంత్రిమండలి అభిప్రాయాలకు వీసమెత్తయినా విలువ ఇవ్వకుండా నాటి మహిళా ప్రధాని ఇందిరాగాంధీ తీసుకున్న ఏకపక్ష నిర్ణయాన్ని నాటి రాష్ట్రపతి ఫక్రుదీద్న్ అలీ అహ్మద్ ఆమోదముద్ర వేశారు.
కేవలం ప్రధాని హోదాలో ఉన్న ఒక్కరి సలహాకు రాష్ట్రపతి ఆమోదం తెలపకూడదు. రాజ్యాంగంలో దీనిపై ఎన్నెన్నో నిబంధనలున్నాయి. ప్రధాని సారథ్యంలోని మంత్రులు రాష్ట్రపతికి సలహాలు, సూచనలు చేయొచ్చు. కానీ ఇవేం పట్టించుకోకుండా ఇందిరా గాంధీ సిఫార్సుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీని విపరిణామాలను వెంటనే దేశం చవిచూసింది. ఆనాడు కొన్ని గంటల వ్యవధిలోనే లక్షకుపైగా పౌరులను ప్రభుత్వం కటకటాల వెనక్కు నెట్టింది’’అని ధన్ఖడ్ గుర్తుచేశారు.
న్యాయస్థానం పాత్ర దారుణం
‘‘ఎమర్జెన్సీ కాలంలో ప్రజాస్వామ్య ప్రాథమిక సూత్రాలు అమలుకాకుండా ప్ర భుత్వం అడ్డుకుంది. అలాంటప్పుడు జ నం న్యాయం కోసం న్యాయస్థానాల వైపు చూస్తారు. పౌరుల ఆకాంక్షలు నెరవేరేలా తొమ్మిది హైకోర్టులు ఎమర్జెన్సీ విధించినా, విధించకపోయినా ప్రాథమిక హక్కులు మనుగడలోనే ఉంటాయని చరిత్రాత్మక తీ ర్పులు ఇచ్చాయి. కానీ ఆ తీర్పులను కొట్టే స్తూ సుప్రీంకోర్టు అత్యంత ప్రజాస్వామికవ్యతిరేక తీర్పును వెలువర్చింది. ఇది నిజ ంగా ప్రపంచం న్యాయచరిత్రలోనే చీకటిపేజీ. ఎమర్జెన్సీ అమల్లో ఉంటే పౌరులకు ప్రాథమిక హక్కులు ఉండబోమని సుప్రీంకోర్టు తెలిపింది.
సుప్రీంకోర్టు తీర్పుతో నియంతృత్వం, అధికారవాదం దేశంలో తిష్టవేశాయి. కోర్టుల్లో న్యాయం దక్కుతుందని భావిస్తున్న ప్రపంచం ఈ తీర్పుతో దిగ్భ్రాంతికి గురైంది. ఎంతకాలం ఎమర్జెన్సీ కొనసాగాలో అంతకాలం అది అమల్లోఉండేలా పాలకులు ఆశించిందే చివరకు జరిగింది’’అని ధన్ఖడ్ అన్నారు. ఈ పరిణామాల దృష్ట్యానే నేటి ప్రభుత్వం జూన్ 25వ తేదీని ‘సంవిధాన్ హత్యా దివస్’గా జరపాలని సముచితంగా నిర్ణయం తీసుకుందని ఆయన వ్యాఖ్యానించారు. దేశంలో 1975 జూన్ 25 నుంచి 1977 మార్చి 21వ తేదీదాకా ఎమర్జెన్సీ అమల్లో ఉంది.