
ఢిల్లీ: ఇండిగో ఎయిర్ లైన్స్కు ఢిల్లీ వినియోగదారుల ఫోరం భారీ జరిమానా విధించింది. విమానంలో ఓ ప్రయాణికురాలికి అపరిశుభ్రమైన, అసౌకర్యవంతమైన సీటును కేటాయించినందుకుగాను రూ.1.5 లక్షల జరిమానా విధిస్తూ నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా.. ఈ కేసుకు సంబంధించి ఆమె ఖర్చు చేసిన రూ.25,000 కూడా చెల్లించాలని ఆదేశించింది.
వివరాల ప్రకారం.. ఈ ఏడాది జనవరి ఐదో తేదీన పింకీ అనే మహిళ బాకు-ఢిల్లీ ఇండిగో విమానంలో ప్రయాణించింది. ఈ సందర్భంగా విమానంలో తనకు అపరిశుభ్రమైన సీటు కేటాయించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేసింది. అనంతరం, ఈ ఘటనపై ఢిల్లీలోని వినియోగదారుల ఫోరంను ఆశ్రయించారు. దీని వల్ల తాను శారీరకంగా, మానసికంగా ఇబ్బంది పడినట్లు తెలిపారు. ఫిర్యాదుపై విచారణ జరిపిన కమిషన్ అపరిశుభ్రమైన, అసౌకర్యవంతమైన సీటును కేటాయించినందుకుగాను ఇండిగో ఎయిర్ లైన్స్కు రూ.1.5 లక్షల జరిమానా విధించింది. ఈ మొత్తాన్ని సదరు ప్రయాణికురాలికి చెల్లించాల్సిందిగా ఆదేశించింది. అలాగే, ఈ కేసుకు సంబంధించి ఆమె ఖర్చు చేసిన రూ.25,000 కూడా చెల్లించాలని పేర్కొంది.
అయితే.. ఈ ఆదేశాలను ఇండిగో వ్యతిరేకించింది. ప్రయాణికురాలికి కేటాయించిన సీటు సరిగ్గా లేకపోడంతో ఆమె అభ్యర్థన మేరకు తాము వేరే సీటు కేటాయించినట్లు తెలిపింది. అనంతరం ఆమె సౌకర్యవంతంగా తన ప్రయాణాన్ని పూర్తి చేసినట్లు పేర్కొంది. అయినప్పటికీ వినియోగదారుల ప్రయాణ సమాచారాన్ని తెలిపే రికార్డులలో భాగమైన సిట్యువేషన్ డేటా డిస్ప్లే నివేదికను సమర్పించడంలో ఎయిర్లైన్స్ విఫలమైందని తెలిపింది. అందుకే జరిమానాను చెల్లించాల్సిందేనని వినియోగదారుల ఫోరం స్పష్టం చేసింది.