
చైనాకు నేరుగా భారతీయ విమాన సర్వీసులు
త్వరలో సేవలు పునరుద్దరించనున్న ఎయిర్ఇండియా, ఇండిగో ఎయిర్లైన్స్!
ఎట్టకేలకు నాలుగేళ్ల తర్వాత మొదలుకానున్న పౌరవిమాన సేవలు
న్యూఢిల్లీ: కోవిడ్ సంక్షోభం, గల్వాన్ ఉద్రిక్తతలతో బీటువారిన చైనా, భారత్ బంధానికి భారతీయ విమానాలు మళ్లీ ఆకాశ మార్గాన స్నేహవారధి నిర్మించను న్నాయి. నాలుగేళ్లుగా ఆగిపోయిన భారత్, చైనా నేరుగా విమానసర్వీసులను త్వరలో పునరు ద్ధరించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. టియాజిన్ సిటీలో జరగబోయే షాంఘై సహకార సంస్థ(ఎస్సీఓ) శిఖరాగ్ర సదస్సు కోసం భారత ప్రధాని నరేంద్ర మోదీ చైనాలో పర్యటించనున్న నేపథ్యంలో భారత్–చైనా మధ్య నేరుగా విమాన సర్వీసులు పునరు ద్ధరణ బాటలో పయనిస్తుండటం విశేషం.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎడాపె డా టారిఫ్ల మోత మోగించడంతో విసిగి పోయిన భారత్, చైనాలు మళ్లీ స్నేహగీతాన్ని ఆలపించనున్నాయని, అందులో భాగంగానే నేరుగా విమానసర్వీసుల పునర్ప్రారంభానికి శ్రీకారం చుడుతున్నారని జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. నాలుగు సరిహద్దు రాకపోకల మార్గాల గుండా సరకు రవాణాకు ఇరుదేశాలూ మొగ్గు చూపుతు న్నవేళ నాలుగేళ్ల తర్వాత ఎట్టకేలకు డైరెక్ట్ ఫ్లైట్ సేవలు అందుబాటులోకి రానున్నాయని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.
నూతన ఎయిర్సర్వీసుల ఒప్పందం త్వరలో ఖరారు కాబోతోందని ఆయా వర్గాలు తెలిపాయి. ఇది ఒకవేళ ఖరారుకాక పోయినాసరే పాత విధానంలో విమాన సర్వీసులను మొదలు పెట్టాలని చూస్తున్నారు. ఎయిర్ఇండియా, ఇండిగో వంటి దేశీయ పౌర విమానయా సంస్థలు ఇకపై నేరుగా చైనాకు విమాన సర్వీసులను మొదలెట్టాలని మోదీ సర్కార్ సూచించినట్లు తెలుస్తోంది.
గల్వాన్ నుంచి గట్టిబంధం దిశగా
2020 మేలో తూర్పు లద్దాఖ్లో ఇరు దేశాల సైనికుల మధ్య ఉద్రిక్తతకు బీజం పడింది. జూన్లో గల్వాన్ లోయలో భారత్, చైనా సైనికుల మధ్య జరిగిన ముష్టిఘాతం, పిడిగుద్దులు, ఘర్షణ కారణంగా ఇరువైపులా జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. దీంతో సరిహద్దు వెంట గతంలో ఎన్నడూ చూడని స్థాయిలో భారీ ఎత్తున సైన్యాన్ని మోహరించి ఉద్రిక్తతలను మరింత పెంచారు. దీంతో భారత్, చైనా సత్సంబంధాలు అడుగంటాయి. పాస్పోర్ట్లు, దిగుమతులు, అనుమతులు మొదలు మరెన్నో రంగాల్లో సత్సంబంధానికి బీటలు పడ్డాయి.
అయితే ట్రంప్ ఇష్టారీతిన విధించిన దిగుమతి సుంకాల భారంతో ఇబ్బందులు పడుతున్న భారత్, చైనాలు ఉమ్మడిగా ఈ సమస్యను పరిష్కరించుకుందామని భావిస్తున్నాయి. ఇందుకోసం మళ్లీ స్నేహగీతం పాడక తప్పని నెలకొంది. గత కొద్దినెలలుగా ఇందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. చైనా జాతీయులకు పర్యాటక వీసాలు ఇచ్చేందుకు భారత ప్రభుత్వం గత నెలలో అంగీకారం తెలిపింది. దాదాపు ఏడేళ్ల తర్వాత ప్రధాని మోదీ చైనాలో పర్యటనకు సిద్ధపడ్డారు.
చైనాతో బంధం బలపడాలని తాము కోరుకుంటున్నామని ఆదేశ పర్యటనను ఖరారుచేసి మోదీ సూచనప్రాయంగా చెప్పారు. భారత్ వంటి దేశాలపై టారిఫ్ను అమెరికా పెంచడాన్ని చైనా సైతం తీవ్రంగా పరోక్షంగా ఖండించింది. ఇలా నెమ్మదిగా బలపడుతున్న మైత్రీ బంధాన్ని నేరుగా విమానసర్వీసుల ద్వారా మరింత పటిష్టంచేయాలని భారత్ ఆశిస్తోంది. చివరిసారిగా మోదీ చైనాలో 2018 జూన్లో పర్యటించారు. ఆ తర్వాతి ఏడాది అక్టోబర్లో చైనా అధ్యక్షుడు జిన్పింగ్ భారత్లో పర్యటించారు.