లక్షద్వీప్‌పై పాక్‌ కన్ను.. భారత్‌ ఎత్తుగడతో చిత్తు! | How Lakshadweep Become Part Of India, Here's All You Need To Know - Sakshi
Sakshi News home page

Lakshadweep Islands History: లక్షద్వీప్‌పై పాక్‌ కన్ను.. భారత్‌ ఎత్తుగడతో చిత్తు!

Jan 8 2024 11:42 AM | Updated on Jan 8 2024 12:07 PM

how lakshadweep become part of india - Sakshi

ప్రధాని నరేంద్ర మోదీ లక్షద్వీప్ పర్యటనపై సర్వత్రా చర్చ జరుగుతోంది. అక్కడ ప్రధాని మోదీ సాహసాలకు సంబంధించిన పలు చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. లక్షద్వీప్ భారతదేశానికి చెందిన అతి చిన్న కేంద్రపాలిత ప్రాంతం. దీని వైశాల్యం 32.62 చదరపు కిలోమీటర్లు. అయితే లక్షద్వీప్ భారతదేశంలో ఎలా భాగమైందో  ఇప్పుడు తెలుసుకుందాం. 

లక్షద్వీప్ 36 చిన్న ద్వీపాల సమూహం. అయితే   ఇక్కడి 10 ద్వీపాలలో మాత్రమే ప్రజలు నివసిస్తున్నారు. ఇక్కడి జనాభాలో 96 శాతం మంది ముస్లింలు. లక్షద్వీప్ రాజధాని కవరత్తి. 2011 నాటి జనాభా లెక్కల ప్రకారం లక్షద్వీప్ మొత్తం జనాభా 64473. ఇక్కడ అక్షరాస్యత రేటు 91.82 శాతం. లక్షద్వీప్ 1947 ఆగస్టులో భారతదేశంలో భాగంగా మారింది. భారత్‌- పాకిస్తాన్ విడిపోయినప్పుడు ఇది జరిగింది. 

నాటి రోజుల్లో 500కు మించిన సంస్థానాలను ఏకం చేయడంలో నాటి భారత హోం మంత్రి , ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ కీలక పాత్ర పోషించారు. అప్పటి పాకిస్తాన్ ప్రధాని లియాఖత్ అలీ ఖాన్ పంజాబ్, సింధ్, బెంగాల్, హజారాలను పాకిస్తాన్‌లో విలీనం చేసేందుకు శాయశక్తులా ప్రయత్నించారు. అయితే లక్షద్వీప్‌ను ఎవరూ పట్టించుకోలేదు.

స్వాతంత్ర్యం తరువాత లక్షద్వీప్ అటు భారత్‌, లేదా ఇటు పాకిస్తాన్ అధికార పరిధిలో లేదు. పాక్‌ ప్రధాని లియాఖత్ అలీ ఖాన్ లక్షద్వీప్ ముస్లిం మెజారిటీ ప్రాంతంకావడంతో దానిని స్వాధీనం చేసుకోవాలని అనుకున్నాడు. అయితే అదే సమయంలో భారత హోం మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ కూడా లక్షద్వీప్ గురించి ఆలోచించినట్లు చరిత్రకారులు తెలిపారు. ఈ గందరగోళ పరిస్థితుల మధ్య పాకిస్తాన్ తన యుద్ధనౌకను లక్షద్వీప్‌కు పంపింది. 

ఇదే సమయంలో సర్దార్ పటేల్ భారత సైన్యాన్ని లక్షద్వీప్ వైపు వెళ్లి.. అక్కడ భారత జాతీయ జెండాను ఎగురవేయాలని ఆదేశించారు. దీంతో భారత సైన్యం.. పాక్‌ కన్నా ముందుగా లక్షద్వీప్‌కు చేరుకుని త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసింది. కొంతసేపటికి పాక్‌ యుద్ధ నౌక కూడా అక్కడికి చేరుకుంది. అయితే వారు భారత త్రివర్ణ పతాకాన్ని చూసి, నిశ్శబ్దంగా వెనక్కి వెళ్లిపోయారు. అప్పటి నుంచి లక్షద్వీప్ భారతదేశంలో అంతర్భాగంగా మారింది. అయితే నాటి పరిస్థితుల్లో భారత సైన్యం లక్షద్వీప్‌ను చేరుకోవడంలో అరగంట ఆలస్యమై ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని చరిత్ర నిపుణులు అంటుంటారు.

లక్షద్వీప్ 1956, నవంబరు ఒకటిన ప్రత్యేక కేంద్రపాలిత ప్రాంతంగా ఏర్పడింది. అప్పుడు దీనిని లక్కడివ్-మినీకాయ్-అమిని దీవి అని పిలిచేవారు. 1973, నవంబరు ఒకటిన ఈ ద్వీపానికి లక్షద్వీప్‌ అనే పేరు పెట్టారు. భౌగోళిక కారణాల రీత్యా లక్షద్వీప్‌కు పూర్తిస్థాయి కేంద్ర పాలిత ప్రాంతం హోదా లభించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement