
న్యూఢిల్లీ: పాకిస్తాన్ పౌరులకు ఇచ్చిన 14 కేటగిరీల వీసాలను రద్దు చేస్తున్నట్లు కేంద్ర హోంశాఖ శుక్రవారం వెల్లడించింది. పహల్గాం ఉగ్రవాద దాడి నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టంచేసింది. ఇందులో బిజినెస్, కాన్ఫరెన్స్, విజిటర్ వంటి వీసాలు ఉన్నాయి. ఈ మేరకు కేంద్ర హోంశాఖ అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలకు సమాచారం చేరవేసింది. పాకిస్తాన్ జాతీయులకు జారీ చేసిన లాంగ్టర్మ్, దౌత్య, అధికారిక వీసాలకు మాత్రం మినహాయింపు ఇస్తున్నట్లు పేర్కొంది.
సార్క్ వీసాలు కలిగినవారంతా ఈ నెల 26వ తేదీలోగా దేశం విడిచివెళ్లిపోవాలని ఆదేశించింది. బిజినెస్, ఫిలిం, జర్నలిస్టు, ట్రాన్సిట్, స్టూడెంట్, గ్రూప్ టూరిస్టు వంటి వీసాలు పొందినవారు ఈ నెల 27వ తేదీలోగా ఇండియాను వీడాల్సి ఉంటుందని స్పష్టంచేసింది. పాకిస్తాన్లోని మైనార్టీలకు ఇచ్చిన బృంద యాత్రికుల వీసాలను సైతం రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది. ఇక మెడికల్ వీసాలపై ఇండియాకు వచ్చినవారు ఈ నెల 29వ తేదీలోగా స్వదేశానికి వెళ్లిపోవాలని కేంద్ర హోంశాఖ తేల్చిచెప్పింది.