రాష్ట్రంలో రేపటి నుంచి (జనవరి 13) కైట్ ఫెస్టివల్ 2026 ప్రారంభం కాబోతుంది. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందర్భంగా ఎగురవేసే పతంగులను ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాల్లో ఎగురవేస్తారు. ఈ నేపథ్యంలో అసలు పతంగుల చరిత్ర ఏంటి ? ఏఏ దేశాలలో వాటిని ఎగురవేస్తారు? రాష్ట్రంలో నిర్వహించే ట్ కైట్ ఫెస్టివల్ ప్రత్యేకతలు.. తెలుసుకోవాలని ఉందా అయితే మరెందుకు ఆలస్యం ఈ స్టోరీపై ఓ లుక్కేయ్యండి.
శ్రీరాముడు ఎగరవేసిన పతంగి
తెలుగురాష్ట్రాల్లో సంక్రాంతి ఎంతో ఘనంగా జరుపుకుంటారు. పంటలు చేతికొచ్చే సమయం కావడంతో రైతులందరూ సంతోషంగా వేడుకను జరుపుకుంటారు. సంక్రాంతి సందర్భంగా గాలిపటాలు ఎగురవేయడం చాలా పాపులర్ అయితే ఈ గాలిపటాలకు ఘనమైన చరిత్రే ఉంది. పురాణాల ప్రకారం శ్రీరామ చంద్రుడు మకర సంక్రాంతి రోజున గాలిపటాన్ని ఎగురవేసారని అది ఇంద్రలోకానికి వెళ్లిందని ప్రజలు విశ్వసిస్తారు. ఈ విషయాన్ని తులసిదాసు రామచరితమానస్లోనూ ప్రస్థావించారు. అప్పటి నుంచి హిందూ సంప్రదాయంలో గాలిపటాలు ఎగురవేయడం ప్రారంభమైందని నమ్ముతారు.
చారిత్రక ఆధారాలు
చరిత్రప్రకారం 5వ శతాబ్ధంలో చైనాలో సైనిక అవసరాల కోసం చెక్క గాలిపటాన్ని తయారు చేశారని దీనిని సైనిక సమాచారం కోసం, గాలిదిశను తెలుసుకోవడం కోసం వినియోగించేవారని ఆధారాలున్నాయి. అనంతరం భారత్కు చైనా యాత్రికులు ఫాహియాన్, హుయాన్త్సాంగ్ వచ్చినప్పుడు వీటిని తీసుకవచ్చారని చరిత్రకారులు చెబుతుంటారు. అంతేకాకుండా మెుగలుల కాలంలో సైతం గాలిపటాల క్రీడలు నిర్వహించేవారని ఆ తరువాతి కాలంలో క్రమంగా ఆటలుగా మారాయని చెబుతుంటారు.
శరీరానికి కలిగే మేలు
గాలిపటాలు బహిరంగ ప్రదేశాల్లో ఎగురవేస్తారు దీంతో సూర్యరశ్మి శరీరానికి సమృద్ధిగా తాకి విటమిన్ డీ లభిస్తుందని చెబుతుంటారు. చలికాలంలో వీటిని ఎగరవేస్తారు గనుక చలినుంచి రక్షణ కోసమనే వాదన ఉంది. అంతేకాకుండా గాలిపటాన్ని నియంత్రించడం అనేది ఒక విన్యాసం. దీని ద్వార కళ్లకు, మెదడుకు చక్కటి వ్యాయామం కలుగుతుంది. ఏకాగత్రను పెంచడానికి ఇది ఎంతగానో తోడ్పడుతుంది.
ప్రపంచవ్యాప్తంగా
అయితే ఇంత ఘనమైన చరిత్ర ఉన్న పతంగులు నేడు ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో దేశాలలో ఎగురవేస్తున్నారు. అమెరికా, బ్రెజిల్, యూరప్, ఫ్రాన్స్లతో పాటు చైనా, జపాన్, థాయిలాండ్, ఇండోనేషియాలతో పాటు ఇతర దేశాలలో గాలిపటాలు ఎగురవేయడాన్ని పెద్ద వేడుకలాగా నిర్వహిస్తారు. దీనికోసం ప్రత్యేక పోటీలు నిర్వహించి ఘనంగా వేడుకలు జరుపుతారు. భారత్లోనూ గుజరాత్, పంజాబ్, రాజస్థాన్, మహారాష్ట్రలలో పతంగుల పండుగ నిర్వహిస్తారు. గుజరాత్లో నిర్వహించే కైట్ ఫెస్టివల్ దేశవ్యాప్తంగా చాలా ఫేమస్
కైట్ ఫెస్టివల్-2026
హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో కైట్ ఫెస్టివల్-2026 జనవరి 13 నుంచి 18 వరకూ జరగనుంది. ఈ వేడుకల్లో 19 దేశాల నుంచి 40 మంది అంతర్జాతీయ కైట్ ప్లయర్స్ థాయిలాండ్, ఇండోనేషియా, ఆస్ట్రేలియా, ఆల్జీరియా, కెనడా, జపాన్, ఫ్రాన్స్, ఇటలీ, శ్రీలంక, రష్యా, స్విట్జర్లాండ్, తదితర దేశాల నుంచి పాల్గొననున్నట్లు ప్రభుత్వం తెలిపింది. అదేవిధంగా దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాల నుంచి 55 మంది నేషనల్ కైట్ ఫ్లయర్స్ పాల్గొననున్నట్లు ప్రకటించింది. ఫెస్ట్ సందర్భంగా సాంస్క్రృతిక ప్రదర్శనలతో పాటు వివిధ రకాల ఫుడ్ స్టాళ్లను ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. అయితే ఈ ఫెస్ట్లో మాంజా దారంతో పతంగులు ఎగురవేయడం నిషిద్దమని కేవలం పత్తితో తయారు చేసిన దారంతోనే గాలిపటాలు ఎగురవేయాలని నియమం విధించింది. తెలంగాణలో అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్ 2011 నుంచి ప్రారంభమయ్యింది.


