ఢిల్లీ వాసులకు ‘హై స్పీడ్‌’ ప్రయాణం | High speed travel for Delhiites | Sakshi
Sakshi News home page

ఢిల్లీ వాసులకు ‘హై స్పీడ్‌’ ప్రయాణం

Oct 20 2023 5:23 AM | Updated on Oct 20 2023 5:23 AM

High speed travel for Delhiites - Sakshi

‘ప్రయాణానికి తక్కువ సమయం, కుటుంబానికి ఎక్కువ...!’. దేశంలోనే తొలి సెమీ హైస్పీడ్‌ రీజనల్‌ రైల్‌ సరీ్వస్‌కు సంబంధించిన ఆకర్షణీయమైన నినాదాల్లో ఇదొకటి! ర్యాపిడ్‌ ఎక్స్‌గా పిలుస్తున్న ఈ తొలి సెమీ హై స్పీడ్‌ ప్రాంతీయ రైలు దేశ రాజధాని ప్రాంత (ఎన్‌సీఆర్‌) వాసులకు అందుబాటులోకి రానుంది. మొత్తం 82 కిలోమీటర్ల మేర చేపట్టిన ఢిల్లీ–గాజియాబాద్‌–మీరట్‌ రీజనల్‌ ర్యాపిడ్‌ ట్రాన్సిట్‌ సిస్టం (ఆర్‌ఆర్‌టీఎస్‌) కారిడార్‌లో 17 కి.మీ. ప్రస్తుతం సిద్ధమైంది.

సాహిబాబాద్‌–దుహై స్టేషన్ల మధ్యనున్న ఈ కారిడార్‌ను శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో ర్యాపిడ్‌ ఎక్స్‌ రైలుకు నమోభారత్‌గా గురువారం నామకరణం చేశారు. శనివారం నుంచి ఇది ప్రయాణికులకు అందుబాటులోకి వస్తుంది. కారిడార్‌లో కొత్తగా నిర్మించిన స్టేషన్లలో అందమైన కుడ్యచిత్రాలు, ఆకర్షణీయమైన నినాదాలు అలరిస్తున్నాయి. అంతేనా...! ఈ ర్యాపిడ్‌ ఎక్స్‌ హై స్పీడ్‌ రైల్వే వ్యవస్థ విశేషాలు అన్నీ ఇన్నీ కావు...

గంటకు 160 కి.మీ. వేగం!
► ర్యాపిడ్‌ ఎక్స్‌ ద్వారా రాజధాని వాసులకు ప్రయాణ సమయం ఏకంగా మూడో వంతు దాకా తగ్గనుంది.
► ప్రయోగాల సందర్భంగానే ర్యాపిడ్‌ ఎక్స్‌ రైళ్లు గంటకు 160 కి.మీ. వేగాన్ని సులువుగా అందుకున్నాయి!
► అనేక ఆకర్షణీయమైన ఫీచర్లు ఈ రైళ్ల సొంతం.
► ఒక్కో రైల్లో ఆరు కోచ్‌లుంటాయి. వీటిలో 1,700 మంది ప్రయాణించవచ్చు.
► ప్రతి రైల్లో ఒక మహిళా కోచ్‌తో పాటు వారికి దివ్యాంగులకు, వృద్ధులకు కొన్ని సీట్లు ప్రత్యేకిస్తారు.
► రెండు వరుసల్లో, వరుసకు రెండు చొప్పున సీట్లుంటాయి. నిలబడేందుకు విశాలమైన స్థలం అందుబాటులో ఉంటుంది.
► ల్యాప్‌టాప్, మొబైల్‌ చార్జింగ్‌ పాయింట్లు, లగేజీ ర్యాక్‌లు, అభిరుచికి అనుగుణంగా లైటింగ్‌ను మార్చుకునే వెసులుబాటు, సీట్‌ పుష్‌ బ్యాక్, కోట్‌ తగిలించుకునే హుక్, ఫుట్‌ రెస్ట్, ప్రీమియం కోచ్‌లో ప్రయాణికులకు సాయపడేందుకు అసిస్టెంట్, స్నాక్స్, డ్రింక్స్‌ కొనుక్కునేందుకు వెండింగ్‌ మెషీన్ల వంటివెన్నో ఇందులో ఉన్నాయి.
► ఉదయం ఆరింటి నుంచి రాత్రి 11 దాకా ప్రతి 15 నిమిషాలకు ఒక రైలు అందుబాటులో ఉంటుంది.
► డిమాండ్‌ను, అవసరాన్ని బట్టి మున్ముందు ప్రతి 5 నిమిషాలకు ఒక రైలు నడుపుతారు.
► చార్జీలు స్టాండర్డ్‌ కోచ్‌లో రూ.20–రూ.40, ప్రీమియం కోచ్‌లో రూ.40–రూ.100.
► ప్రతి స్టేషన్‌నూ ఆకర్షణీయమైన రంగులతో కూడిన కుడ్య చిత్రాలు, నినాదాలతో ఆకట్టుకునేలా తయారు చేశారు.
ళీ    ఈ ర్యాపిడ్‌ ఎక్స్‌ ప్రాజెక్టును ఢిల్లీ, హరియాణా రాజస్తాన్, ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వాలతో కలిసి కేంద్రం సంయుక్తంగా చేపట్టింది.
► ఢిల్లీ–గాజియాబాద్‌–మీరట్‌ మధ్య 81.15 కి.మీ. ఆర్‌ఆర్‌టీఎస్‌ వ్యవస్థ 2025 కల్లా పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుంది.
► ప్రాజెక్టు అంచనా వ్యయం దాదాపు రూ.30 వేల కోట్లు.

‘ఏఐ’ బ్యాగేజ్‌ స్కానింగ్‌
ర్యాపిడ్‌ ఎక్స్‌ రైళ్ల ఉద్దేశమే ప్రయాణ సమయం తగ్గించడం. అందుకు అనుగుణంగా కారిడార్‌లోని స్టేషన్లలో బ్యాగేజీ తనిఖీ సమయాన్ని బాగా తగ్గించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఇందుకోసం కృత్రిమ మేధ ఆధారంగా పని చేసే సాంకేతిక వ్యవస్థను ఉపయోగిస్తున్నారు. నియంత్రిత, నిషేధిత వస్తువులుంటే అది వెంటనే భద్రతా సిబ్బందిని అప్రమత్తం చేస్తుంది.
► ఇందులో డ్యుయల్‌ వ్యూతో కూడిన ఎక్స్‌ రే బ్యాగేజీ తనిఖీ వ్యవస్థ ఉంటుంది. దాంతో బ్యాగేజీ తాలూకు పై, లోపలి భాగాలు స్క్రీన్‌పై విడిగా, స్పష్టంగా కని్పస్తాయి.
► ఈ స్టేషన్లలో తక్షణ స్పందన బృందం, బాంబ్‌ డిటెక్షన్‌–డిస్పోజల్‌ స్క్వాడ్, డాగ్‌ స్క్వాడ్‌ వంటివాటిని యూపీ పోలీసులు అందుబాటులో ఉంచనున్నారు!


– సాక్షి, నేషనల్‌ డెస్క్‌

Advertisement
 
Advertisement
Advertisement